ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా పీఆర్సీ సాధన సమితి నేతృత్వంలో ఉద్యోగులు గురువారం నాడు ‘చలో విజయవాడ’ కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి వేల సంఖ్యలో ఉద్యోగులు విజయవాడకు చేరుకొని ఎన్జీవో హోం నుంచి బీఆర్టీఎస్ కూడలి వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా పీఆర్సీ సాధన సమితి నేతలు మాట్లాడుతూ, ఫిబ్రవరి 5 నుంచి సహాయనిరాకరణ చేపడతామని, ఫిబ్రవరి 6వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్లనున్నట్టు తెలిపారు.
కాగా ఏపీ ఉద్యోగుల ‘చలో విజయవాడ’ కార్యక్రమంపై మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు
నాయుడు స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్స్ చేశారు. చలో విజయవాడలో ఉద్యోగుల నిరసనలపై సీఎం జగన్ ప్రభుత్వ నియంతృత్వ తీరును ఖండిస్తున్నానని పేర్కొన్నారు. “ప్రభుత్వంలో భాగమైన ఉద్యోగులను ఉగ్రవాదుల్లా అరెస్టులు చేస్తారా? విశ్వసనీయతపై ఉద్యోగుల ప్రశ్నలకు సీఎం జగన్ సమాధానం చెప్పాలి. రివర్స్ పిఆర్సిని వెనక్కి తీసుకోవాలి. నియంతృత్వం వీడి పరిష్కారం చూపాలి. లక్షల ఉద్యోగుల సమస్యపై అహంకారంతో కాకుండా, ఆలోచనతో స్పందించాలి. ప్రభుత్వం చేసిన మోసంపై నిరసన తెలిపే హక్కు ఉద్యోగులకు లేదా? ఉద్యోగులు రాష్ట్ర ప్రజలు కాదా, రాష్ట్రంలో భాగస్వాములు కాదా?, రాజకీయపక్ష నేతలపై పెట్టినట్లు ఉద్యోగులపై గృహ నిర్భంధాలు సీఎం జగన్ వైఖరిని స్పష్టం చేస్తున్నాయి” అని అన్నారు.
“పోలీసు పహారా పెట్టి ఉపాధ్యాయులను నిర్భందించడం, విద్యార్థుల ముందు టీచర్లను అవమానించడమే. మాయ మాటలతో ప్రజలను, ఉద్యోగులను మోసం చేసి అధికారంలోకి వచ్చిన జగన్, ఇప్పుడు అంకెల గారడీతో జీతాలు తగ్గించలేదని మళ్లీ మోసం చేస్తున్నారు. ఉద్యోగులను అగౌరపరిచే, ఆత్మగౌరవం దెబ్బతీసే విధానాన్ని జగన్ ఇప్పటికైనా వీడాలి. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో, తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మేము 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చాము. కానీ జగన్ సర్కార్ లా ఐఆర్ కంటే తక్కువ ఫిట్మెంట్ ఇచ్చి జీతాలు రికవరీ చెయ్యడం దేశంలోనే ఇప్పటి వరకు జరగలేదు. ప్రభుత్వం భేషజాలు పక్కన పెట్టి, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని నేను డిమాండ్ చేస్తున్నా” అని చంద్రబాబు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ