వైసీపీ మాంచి దూకుడు మీదుంది. ఎన్నికలు ముంచుకొస్తుండడంతో వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. విడతల వారీగా తమ గెలుపు గుర్రాలను బరిలోకి దించుతోంది. ఇటు తెలుగుదేశం-జనసేన కూటమి కూడా దూకుడు పెంచేసింది. మొన్నటి వరకు కాస్త వెనుకడుగు వేసిన కూటమి.. ఇప్పుడు స్పీడ్ పెంచేసింది. సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్పీడప్ చేసింది. వీలైనంత త్వరగా అభ్యర్థులను ప్రకటించేందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారు. ఇదే సమయంలో ఎంపీ స్థానాలకు సంబంధించి సీట్ల సర్దుబాటు.. అభ్యర్థుల ఎంపిక కూడా పూర్తయినట్లు తెలుస్తోంది.
ఏపీలో మొత్తం 25 ఎంపీ స్థానాలు ఉండగా.. అందులో 2 స్థానాలను చంద్రబాబు జనసేనకు కేటాయించారట. మిగిలిన 23 స్థానాల నుంచి తెలుగు దేశం పార్టీ బరిలోకి దిగనుందట. ఈ మేరకు ఆయా స్థానాలు.. అభ్యర్థుల జాబితా ఒకటి వైరలవుతోంది. ఆ జాబితాను త్వరలోనే కూటమి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం వైరలవుతున్న జాబితా ప్రకారం.. కాకినాడ, మచిలీపట్నం లోక్ సభ స్థానాల నుంచి జనసేన బరిలోకి దిగనుందట. కాకినాడ నుంచి జనసేన తరుపున సానా సతీశ్.. మచిలీపట్నం నుంచి వైసీపీ రెబల్ ఎంపీ వల్లభనేని వంశీ బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.
ఇకపోతే విజయనగరం నుంచి బరిలోకి దించేందుకు కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు, రామ్ మల్లిక్ నాయుడు పేర్లను చంద్రబాబు పరిశీలిస్తున్నారట. వారిద్దరిలో ఒకరిని ఫైనల్ చేయనున్నారట. ఇక శ్రీకాకుళం నుంచి సిట్టింగ్ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడును, విశాఖపట్నం నుంచి హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అల్లుడు శ్రీభరత్ను, అరకు నుంచి మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ను, అమలాపురం నుంచి మాజీ లోక్ సభ స్పీకర్ బాలయోగి కుమారుడు గంటి హరీశ్ను, నరసాపురం నుంచి ఎంపీ రఘురామకృష్ణం రాజును బరిలోకి దించేందుకు చంద్రబాబు కసరత్తు చేస్తున్నారట.
అనకాపల్లి నుంచి పోటీ చేయించేందుకు ప్రముఖ వ్యాపారవేత్త బైరా దిలీప్ చక్రవర్తి, చింతకాయల విజయ్, బుద్ధా వెంకన్నల పేర్లను పరిశీలిస్తున్నారట. రాజమండ్రి నుంచి శిష్టా లోహిత్, బొడ్డు వెంకట రమణలలో ఒకరిని పోటీ చేయించనున్నారట. ఏలూరు నుంచి గోపాల్ యాదవ్ లేదా మరో కొత్త వ్యక్తి పేర్లను చంద్రబాబు పరిశీలిస్తున్నారట. గుంటూరు నుంచి భాష్యం రామకృష్ణ, పెమ్మసాని చంద్రశేఖర్లలో ఒకరిని పోటీ చేయించనున్నారట. చిత్తూరు నుంచి కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్షి లేదా నిహారికను.. కర్నూలు నుంచి సిట్టింగ్ ఎంపీ సంజీవ్ కుమార్ లేదా సార్థసారధిని.. చిత్తూరు నుంచి మాజీ ఎమ్మెల్యే తలారి ఆదిత్య లేదా నటుడు సప్తగిరిని బరిలోకి దించనున్నారట.
ఇక బాపట్ల నుంచి ఉండవల్లి శ్రీదేవిని, ఒంగోలు నుంచి సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని, కడప నుంచి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డిని, నంద్యాల నుంచి మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డిని, అనంతపురం నుంచి మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులును, హిందూపురం నుంచి బీకే పార్థసారధిని, రాజంపేట నుంచి మాజీ ఎమ్మెల్యే సగవాసి పాలకొండ్రాయుడు కుమారుడు సుబ్రహ్మణ్యంను పోటీ చేయించాలని చంద్రబాబు భావిస్తున్నారట.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY