టీడీపీ ఎమ్మెల్సీ అశోక్బాబును ఏపీ సీఐడీ అధికారులు గురువారం అర్ధరాత్రి సమయంలో అరెస్ట్ చేశారు. అశోక్బాబును అదుపులోకి తీసుకున్న అధికారులు గుంటూరు సీఐడీ కార్యాలయానికి తరలించి విచారణ చేస్తున్నారు. పదోన్నతి కోసం నకిలీ విద్యార్హతలను చూపించారన్న ఆరోపణలపై ఆయనను అరెస్ట్ చేసినట్లు తెలిసింది. అశోక్బాబు అసిస్టెంట్ కమర్షియల్ ఆఫీసర్గా పనిచేసే సమయంలో బీకాం చదవకపోయినా చదివినట్టు తప్పుడు సమాచారం ఇచ్చినట్లు సీఐడీ అధికారులు తెలిపారు. అశోక్బాబు వాణిజ్య పన్నుల శాఖలో ఏసీటీవోగా పని చేసి రిటైర్ అయ్యారు. అశోక్బాబు ఏపీ ఎన్జీవో నేతగా, సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో జేఏసీ అధ్యక్షుడిగా కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. తర్వాత ఆయనకు టీడీపీ ఎమ్మెల్సీ పదవిని ఇచ్చింది.
అశోక్బాబు డిగ్రీ చదవకుండానే చదివినట్లుగా చూపించారని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఆయనపై ఆరోపణలు వచ్చాయి. అప్పుడు దీనిపై శాఖాపరమైన విచారణ కూడా జరిగింది. అయితే, తాను ఎలాంటి తప్పు చేయలేదని ఆయన అప్పుడు పేర్కొన్నారు. ఈ క్రమంలో విజిలెన్స్ అధికారులు కూడా విచారణ జరిపి ఆయనపై అభియోగాలను ఉపసంహరించారు. ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ హయాంలోనే దీనికి తెరపడింది. కాగా, తాజాగా పీఆర్సీపై ఉద్యమం జరుగుతున్న సమయంలోనే అశోక్బాబుపై వైసీపీ ప్రభుత్వం ఆనాటి ఆరోపణలను ముందుకు తెచ్చింది. తమకు అందిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఏపీ సీఐడీకి లోకాయుక్త సూచించింది. అయితే, వైసీపీ ప్రభుత్వం కావాలనే తనపై అన్యాయంగా కేసులు పెడుతున్నట్లు అశోక్బాబు ఆరోపిస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ