రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో అధికారంలోకి వచ్చిన తెలుగు దేశం పార్టీ రాజధానిని అమరావతికి మార్చింది. కానీ రాజధాని పనులు పూర్తికాకముందే ఏపీలో టీడీపీ గద్దె దిగిపోయి.. వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చింది. మొదట్లో అమరావతికి మద్ధతు ఇచ్చిన వైసీపీ.. ఆ తర్వాత మూడు రాజధానులను తెరపైకి తీసుకొచ్చింది. అయిదేళ్లయినప్పటికీ ఇప్పటికీ రాజధానిలో ప్రజాకార్యకలాపాలు మొదలు కాలేదు. త్వరలో ఎన్నికలు జరగనున్న వేళ రాజధాని అంశం కాక రేపుతోంది. ఇటీవల రాజధాని అంశంపై స్పందిస్తూ వైసీపీ కీలక నేత వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మరో రెండు సంవత్సరాలు ఏపీ రాజధానిగా హైదరాబాద్నే కొనసాగించాలని వ్యాఖ్యానించారు.
ఇప్పటికే సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతుండగా.. ఇప్పుడు మరో నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని తెరపైకి తీసుకొస్తూ.. తిరుపతిని ఏపీకి రాజధానిని చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ వ్యాఖ్యానించారు. ఇప్పటికే బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానం అనే రూపాల్లో నిరూపితం అయిందని వ్యాఖ్యానించారు. ఆయన కాలజ్ఞానంలో తిరుపతి రాజధాని అవుతుందని రాసి ఉందన్న చింతామోహన్.. దీనిని నిజం చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ప్రస్తుత పరిణామాల దృష్ట్యా తిరుపతి ఏపీకి రాజధాని అవుతుందనే నమ్మకం తనకుందని వ్యాఖ్యానించారు.
తిరుపతి రాజధాని అవుతుందని తాను భావిస్తున్నానని.. అటు ఏపీ ప్రజలు కూడా తిరుపతిని రాజధానిని చేయాలని కోరుకుంటున్నారని చింతా మోహన్ పేర్కొన్నారు. రాయలసీమలో ఎప్పుడూ కరువు, కష్టాలు, కన్నీళ్లే కనిపిస్తున్నాయని.. రాయలసీమ అభివృద్ధి చెందాలంటే తిరుపతిని రాజధానిని చేయాలని డిమాండ్ చేశారు. అలాగే తిరుపతిలో లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని.. రహదారులు కూడా ఉన్నాయన్నారు. తిరుపతిని ఏపీకి రాజధానిని చేస్తే ప్రభుత్వ కార్యకలాపాలకు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదని చింతా మోహన్ చెప్పుకొచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE