ఏపీలో ఎన్నికలు ముంచుకొస్తున్నవేళ ఎత్తులు.. పొత్తులు తెరపైకి వస్తున్నాయి. అధికార పార్టీని మట్టికరిపించేందుకు ప్రతిపక్షాలు జతకడుతున్నాయి. ఇప్పటికే తెలుగు దేశం-జనసేన పార్టీలు పొత్తుపెట్టుకొని ఎన్నికలకు వెళ్తున్నాయి. బీజేపీని కూడా తమతో చేతులు కలపాలని కూటమి కోరుతోంది. కొంతకాలంగా బీజేపీకి టీడీపీ కాస్త దూరంగా ఉన్నప్పటికీ.. జనసేన మాత్రం మిత్రపక్షంగా ఉంది. అయితే ఒకవేళ బీజేపీ.. కూటమితో చేతులు కలిపితే లాభ నష్టాలు ఏంటి అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
గతంలో బీజేపీని వ్యతిరేకించి ఎన్డీయే కూటమికి చంద్రబాబు దూరమయ్యారు. అదే సమయంలో నరేంద్రమోడీపై చంద్రబాబు వ్యక్తిగత విమర్శలు చేయడంతో.. వారిద్దరి మధ్య ఆగాదం భారీ స్థాయిలో పెరిగిపోయింది. అటు జగన్ గెలుపులో మోడీ స్నేహస్తం ఇవ్వడం.. గెలిచాక జగన్ తప్పులు చేస్తున్నా కేంద్రంలో బీజేపీ మౌనంగా ఉండడంతో టీడీపీలో మెజార్టీ శ్రేణులకు మోడీ అంటే ద్వేషం పెరిగిపోయింది. ఇటీవల చంద్రబాబు అరెస్ట్ అయి జైలుకు వెళ్లారు. దాని వెనుక కూడా మోడీ, అమిత్ షాల హస్తం ఉందన్న అంశం కూడా టీడీపీ శ్రేణులకు బీజేపీపై విపరీతంగా కోపం పెరిగేలా చేసింది.
గత ఎన్నికల్లో బీజేపీకీ కేవలం 0.8 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇప్పుడు అంతకుమించి ఓట్లు తెచ్చుకునే అవకాశం ఎక్కడా కనిపించడం లేదు. గతంలో ఏపీలో బీజేపీ ఎదగకపోవడానికి వెంకయ్యనాయుడును కారణంగా చూపారు. కానీ గడిచిన అయిదేళ్లలో వెంకయ్యనాయుడు రాజకీయంగా క్రియాశీలకంగా లేరు. అయినప్పటికీ రాష్ట్రంలో బీజేపీ ఎందుకు ఎదగలేదనే ప్రశ్న తలెత్తుతోంది. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమిపాలయింది. ఆ తర్వాత జనసేనాని పవన్తో కలిసి బీజేపీ మూడో ప్రత్యాయంగా ఎదిగే అవకాశం ఉన్నప్పటికీ.. అధికార వైసీపీతో అంటకాగి ఈ అవకాశాన్ని కాషాయపు పార్టీ దుర్వినియోగం చేసుకుంది.
ప్రస్తుతం బీజేపీకి సానుకూలంగావున్న అంశం ఏదైనా ఉంది అంటే.. అది కేంద్రంలో మోడీ మళ్లీ వచ్చే అవకాశం ఉందనే అంశమేనని విశ్లేషకులు అంటున్నారు. అయినప్పటికీ. ఏపీలో బీజేపీ సింగిల్గా పోటీ చేస్తే మళ్లీ నోటాతో పోటీ పడాల్సిందేనని విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం వేళ బీజేపీ ప్రతి ఇంటిని టచ్ చేసింది. అక్షింతలు పంపించింది. అయినప్పటికీ బీజేపీకి ఓట్లు పడుతాయా అంటే డౌటే నని అంటున్నారు.
ప్రస్తుతం టీడీపీతో.. జనసేనతో పాటు బీజేపీ కూడా పొత్తుపెట్టుకోబోతుందనే వార్తలు తెరపైకి వచ్చాయి. వైసీపీ రెండోసారి అధికారంలోకి వస్తేనే టీడీపీ బాగా దెబ్బతింటుంది. అప్పుడు బీజేపీ ఎదిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు టీడీపీతో పొత్తుపెట్టుకున్నప్పటికీ బీజేపీ సంపూర్ణ సహకారం ఇస్తుందా.. వ్యవస్థలను మేనేజ్ చేయకుండా జగన్ను అడ్డుకుంటుందా అంటే డౌటే.. అసులు బీజేపీకి ఏపీలో ఓట్లే లేవు.. ఒకవేళ ఉన్నా మూడు భాగాలు.. అందులో పర్సెంటో.. అర పర్సెంటో కలవడం వలన టీడీపీకి పెద్దగా ఒరిగేదేమీ ఉండకపోవచ్చని విశ్లేషకులు అంటున్నారు. ఇంకా బీజేపీతో పొత్తు కుదిరితే క్రిస్టియన్, ముస్లిం ఓట్లు దూరమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఒకవేళ క్రిస్టియన్లకు జగన్పై వ్యతిరేకత ఉన్నప్పటికీ.. ఆ ఓట్లు టీడీపీకి రావు.. బీజేపీతో పొత్తు కూడితో ఇంకా అసలే రావు.. అవన్నీ షర్మిల వైపు మళ్లుతాయి. అటు ముస్లిం ఓట్లు చూస్తే.. రాష్ట్రంలో కడప, రాయచోటి, కదిరి, మదనపల్లి, నంద్యాల, గుంటూరు-తూర్పు ,విజయవాడ-పశ్చిమ ఈ 8 నియోజకవర్గాల్లో మాత్రమే ముస్లిం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. అందులో రాయలసీమలోని ఆరు నియోజకవర్గాల్లో టీడీపీ బలహీనంగా ఉంది. కాబట్టి ఇక్కడ బీజేపీతో పొత్తు వలన నష్టం అయితే కనిపించడం లేదు. ఇటీవల బీజేపీ మాదిగ ఓట్లపై ఫోకస్ పెట్టింది. ఎస్సీ వర్గీకరణపై గతంలోనే బాబు అనుకూల వైఖరి తీసుకున్నారు. ఇప్పుడు మోడీ బాబు కలిస్తే ఆ ఓట్లు మాత్రమే కొంత ప్లస్ అయ్యే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఊహాగానాల ప్రకారం విశాఖ, రాజమండ్రి, నర్సాపురం, అరకు, నెల్లూరు, తిరుపతి, హిందూపురం, రాజంపేట స్థానాలను బీజేపీ అడుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ ప్రధాన నష్టం టీడీపీ-బీజేపీ మధ్య వైరంతోనే.. టీడీపీ అనుకూలురుగావున్న కామినేని వంటి వారికి సీట్లు ఇచ్చినా టీడీపీ ఓట్లు పడుతాయేమో కానీ.. జీవీఎల్ వంటి వారికి సీట్లు ఇస్తే మాత్రం టీడీపీ ఓట్లు బీజేపీ వైపు మళ్లుతాయా అంటే అనుమానమే. ఏది ఏమయినప్పటికీ.. బీజేపీ అంశంలో చంద్రబాబు వైఖరి ఒక రకంగా ఉంటే.. టీడీపీ శ్రేణుల వైఖరి మరో రకంగా ఉంది. అందువల్ల పొత్తు ఉంటుందా? ఉండదా? అనేది చూడాలి మరి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY