కలియుగ దైవమైన శ్రీనివాసుడు కొలువైన తిరుమలలో డ్రోన్ కెమెరాతో చిత్రీకరించిన ఒక వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. అయితే సాధారణంగా శ్రీవారి ఆలయం గగనతలంపై డ్రోన్ కెమెరాలకే కాదు, విమానాలకు కూడా అనుమతి ఉండదనే విషయం తెలిసిందే. అలాంటిది శ్రీవారి ఆలయం పరిసరాలన్నీ విహంగ వీక్షణంలో స్పష్టంగా కనిపిస్తున్న వీడియో శుక్రవారం ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇన్స్టాగ్రామ్ లో ప్రసారం కావడం కలకలం సృష్టించింది. దీంతో ఆలయంలో భద్రతపై ఆందోళన నెలకొంది. విజిలెన్స్ డిపార్ట్మెంట్ గుర్తించకుండా డ్రోన్ ఆలయంపై ఎగరడంపై స్వామివారి భక్తులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అప్రమత్తమైన టీటీడీ అధికారులు నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించారు.
ఈ నేపథ్యంలో దీనిపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతున్న వీడియో వాస్తవం కాదని, తిరుమలలో కట్టుదిట్టమైన భద్రత మధ్య శ్రీవారి ఆలయాన్ని డ్రోన్ కెమెరాతో చిత్రీకరించడం సాధ్యం కాదని తెలిపారు. దీనిని పాత ఫోటోలు, వీడియోలతో త్రీడీ లాగా క్రియేట్ చేసి ఉండొచ్చని భావిస్తున్నామని, ఎందుకంటే ఇది మార్ఫింగ్ చేసినట్లు తమ ప్రాథమిక విచారణలో వెల్లడైందని అన్నారు. అయినా అనుమానాల నివృత్తి కోసం ఆ వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించామని, అలాగే సదరు వీడియోను పరిశీలించిన అనంతరం ఇందుకు కారకులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇక హైదరాబాద్కు చెందిన ఐకాన్ అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో వీడియో అప్లోడ్ చేయబడిందని, ఇది నిజమని తేలితే సదరు సంస్థపై క్రిమినల్ కేసులు పెడతామని కూడా ఆయన హెచ్చరించారు. మరో నాలుగైదు రోజుల్లో దీనిపై స్పష్టత వస్తుందని, నివేదిక వచ్చాక నిజానిజాలు భక్తులకు వెల్లడిస్తామని ఛైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE