భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రెండు రోజుల పర్యటన కోసం బుధవారం తిరుపతి చేరుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని వెంకయ్య నాయుడు దర్శించుకున్నారు. సతీమణి శ్రీమతి ఉషమ్మ, కుమారుడు హర్షవర్ధన్, కోడలు రాధమ్మ సహా ఇతర కుటుంబ సభ్యులతో కలిసి వెంకయ్య నాయుడు శ్రీవారిని దర్శించుకున్నారు. ముందుగా టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, టీటీడీ ఈవో జవహర్ రెడ్డి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు స్వాగతం పలికారు. స్వామిని వారిని దర్శించుకున్న అనంతరం రంగనాయక మండపంలో వేదపండితులు ఆయనకు ఆశీర్వచనం చేయగా, టీటీడీ అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు.
అనంతరం వెంకయ్య నాయుడు మీడియాతో మాట్లాడుతూ, తిరుమల ఆలయాన్ని సందర్శించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. దేశ ప్రజల శాంతి మరియు శ్రేయస్సు కోసం ప్రార్దించినట్లు తెలిపారు. ఆధ్యాత్మికత అంటే సేవాభావం తప్ప మరొకటి కాదని, ప్రజలకు మరింత సేవ చేసేందుకు వేంకటేశ్వరుని దర్శనం స్ఫూర్తినిస్తుందని అన్నారు. భారతీయ సంస్కృతిని, హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. భారతీయ సంస్కృతి మరియు వారసత్వం ఐక్యత, శాంతి, సామాజిక సామరస్యం యొక్క సార్వత్రిక విలువలను ప్రతిపాదిస్తుందని, ప్రతి ఒక్కరూ వాటిని రక్షించడానికి, సంరక్షించడానికి కృషి చేయాలన్నారు. సాధారణ భక్తులకు శ్రీవారి దర్శనాన్ని కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తున్న కృషిని అభినందించారు. ప్రముఖులు, ప్రజాప్రతినిధులు ఏడాదికి ఒక్కసారే దర్శనానికి రావాలని, సామాన్యభక్తులకు అవకాశం కల్పించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ