గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని ఇప్పటం గ్రామంలో మార్చి 14, సోమవారం జరిగిన జనసేన పార్టీ 9వ ఆవిర్భావ దినోత్సవ సభలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పలు అంశాలపై కీలక ప్రసంగం చేశారు. వైసీపీ గద్దె దించి జనసేనను అధికారంలోకి తీసుకువస్తామని ధీమా వ్యక్తం చేశారు. చిత్తశుద్ధితో యుద్ధానికి సన్నద్ధమవుతున్నామని, రాష్ట్ర భవిష్యత్తు కోసం అవసరం అయితే పొత్తుల గురించి ఆలోచిస్తామని పేర్కొన్నారు. ఏపీని అప్పుల్లేని రాష్ట్రంగా మార్చడమే జనసేన లక్ష్యమని ప్రకటించారు,
అప్పుల్లేని రాష్ట్రంగా చూసేందుకు షణ్ముఖ వ్యూహం:
“ఆంధ్రప్రదేశ్ ని అప్పుల్లేని రాష్ట్రంగా చేయాలన్నదే జనసేన పార్టీ లక్ష్యం. అందుకోసం జనసేన పార్టీ ప్రభుత్వం షణ్ముఖ వ్యూహం అనుసరించనుంది. జనసేన పార్టీ అధికారంలోకి రాగానే బలమైన పారిశ్రామిక విధానాన్ని తీసుకువస్తాం. విశాఖ, విజయవాడ నగరాలను హైటెక్ నగరాలుగా తీర్చిదిద్దుతాం. అమరావతిని అభ్యుదయ రాజధానిగా రూపొందిస్తాం. కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు పెడతాం. రాయలసీమలో ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తాం. తెల్ల రేషన్ కార్డు దారులందరికీ ఇళ్ల నిర్మాణానికి ఇసుకను ఉచితంగా అందిస్తాం. సులభ్ కాంప్లెక్సుల్లో పని చేసే ఉద్యోగాలు కాకుండా మీ కాళ్ల మీద మీరు నిలబడగలిగేలా ఉపాధి కల్పించి వారికి ప్రభుత్వం తరఫున రూ.10 లక్షలు అందిస్తాం. వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తాం. వ్యవసాయ ఉత్పత్తుల ఆధారంగా ఆయా ప్రాంతాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తాం. పంట కాల్వలు నిర్మిస్తాం. జనసేన పార్టీ అధికారంలోకి రాగానే నిరుద్యోగ సమస్యను తీరుస్తాం. ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తాం. ప్రైవేటు రంగంలో ఏటా 5 లక్షల ఉద్యగ అవకాశాలు కల్పిస్తాం. ఉద్యోగులకు సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని తీసుకువస్తాం. దీనిపై ఇప్పటికే కేంద్రంలోని పెద్దలతో చర్చించాం. ప్రతి ఒక్క సామాజికవర్గానికి జనసేన పార్టీ అండగా నిలుస్తుంది” అని పవన్ కళ్యాణ్ అన్నారు.
రాష్ట్ర భవిష్యత్తు కోసం అవసరం అయితే పొత్తుల గురించి ఆలోచిస్తాం:
ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై చిత్తశుద్ధితో యుద్ధం చేసేందుకు సన్నద్ధమవుతున్నాం. అందుకోసం బీజేపీ అగ్రనాయకత్వం రోడ్ మ్యాప్ ఇస్తానందనీ, అది ఇస్తే ఈ ప్రభుత్వాన్ని కూల్చేందుకు పని చేస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు. రోడ్ మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నామనీ, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి రావడమే జనసేన పార్టీ లక్ష్యం, ఉద్దేశ్యమన్నారు. వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చే ప్రసక్తే లేదనీ, రాష్ట్ర భవిష్యత్తు కోసం అవసరం అయితే పొత్తుల గురించి ఎన్నికల సమయంలో ఆలోచిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాధ్యతను పవన్ కళ్యాణ్ స్వీకరిస్తాడన్నారు. ఆత్మ గౌరవానికి, ఆధిపత్య అహంకారానికి మధ్య జరుతున్న పోరులో జనసేన పార్టీ విజయం సాధించడం ఖాయమన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ