గల్లీ రాజకీయాల నుంచి ఢిల్లీ రాజకీయాల వరకూ ఎక్కడైనా తన పలుకుబడితో చక్రం తిప్పగల సమర్ధుడు. పార్టీతో సంబంధం లేకుండా ప్రముఖులతో సత్సంబంధాలు ఉన్న వ్యక్తి. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఆయన సొంతం. అయితే.. ప్రత్యక్ష రాజకీయాల్లో తొలిసారి అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఈ క్రమంలో ఎలాగైనా గెలవాలనే కసితో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. చిన్నా చితకా నేతల నుంచి.. పెద్ద నేతలను సైతం కలుపుకుని ముందుకు సాగుతున్నారు. ఆక్రమంలో కొంత దూకుడుగానూ వ్యవహరిస్తున్నారు. ఆ దూకుడు గెలుపునకు బాటలు వేస్తుందా.., లేక కొంపముంచుతుందా అనేది ఆసక్తిగా మారింది. ఆయనే బీజేపీ నేత సీఎం రమేశ్.
కడపకు చెందిన సీఎం రమేశ్ బీజేపీ అనకాపల్లి సెగ్మెంట్ నుంచి ప్రస్తుతం ఎంపీగా బరిలో ఉన్నారు. ఆర్థికంగా బలమైన నేత అయిన రమేశ్.. పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకర్గాల్లో కూటమి నేతలు అందరినీ కలుపుకుని ముందుకు సాగుతున్నారు. తెలుగుదేశం నాయకులతో కూడా ఆయనకు బలమైన సంబంధాలు ఉండడం ఆయనకు కలిసి వచ్చింది. అయితే.. కాస్త దూకుడుగా వెళ్తుండడం చిక్కులు తెచ్చిపెడుతోంది. ఇటీవల చోడవరం మండలం గాంధీ గ్రామంలో ఉన్న బుచ్చిబాబు ట్రేడర్స్ టైల్స్ దుకాణంపై డిఆర్ఐ అధికారులు దాడులు నిర్వహించారు. జిఎస్టి లెక్కలపై ఆరా తీశారు. ఈ విషయాన్ని దుకాణం యజమాని స్థానిక టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కెఎస్ఎన్ఎస్.రాజుకు, బిజెపి ఎంపి అభ్యర్థి సిఎం.రమేష్కు తెలిపాడు. ఎన్నికల సమయం కావడంతో సీఎం రమేశ్ వెంటనే స్పందించారు. ఫోన్ చేసిన వెంటనే హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు.
అధికారులపై ప్రశ్నలవర్షం కురిపించారు. ఈక్రమంలో తమ విధులకు ఆటంకం కలిగించారని, తాము సేకరించిన ఫైల్స్ను లాక్కున్నారని సీఎం రమేశ్పై చోడవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దీనికి సంబంధించి ఆయన స్టేషన్ కు వెళ్లి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అలాగే.. మరో ఘటనలో కోడ్ ఉల్లంఘించారంటూ రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు. ప్రచారంలో దూసుకెళ్దామనుకంటున్న తరుణంలో రమేశ్ కు ఇలా కొన్ని అవాంతరాలు ఎదురవుతున్నాయి. రాష్ట్ర, జాతీయస్థాయిలో కీలక నేతగా ఎదిగిన సీఎం రమేశ్ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవాలన్న తాపత్రయంలో ఇబ్బందుల్లో పడుతున్నారని ఆయన శిబిరంలో చర్చ జరుగుతోంది.
ప్రస్తుతం తెలుగుదేశం-బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీలో సీఎం రమేశ్.. దశాబ్దాల పాటు టీడీపీలో పనిచేశారు. ఆ పార్టీ తరఫున తెరవెనుక మంత్రాంగం నడపడం, ఆర్థిక వనరులు సమకూర్చడంలో కీలకపాత్ర పోషించే వారు. 2014 ఎన్నికల్లో రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చాక రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2019లో టీడీపీ అధికారం కోల్పోవడంతో బీజేపీలో చేరారు. ప్రస్తుతం అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న ఆయనతో వైసీపీ నుంచి సీఎం జగన్ క్యాబినెట్ లో ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న బూడి ముత్యాలనాయుడు తలపడుతున్నారు. 2014లో వైసీపీలో చేరి ఆ పార్టీ తరఫున తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇక గత ఎన్నికల్లో రెండోసారి గెలిచి ఏకంగా ఉప ముఖ్యమంత్రి పదవిని దక్కించుకున్నారు. ఇప్పుడు ఎంపీగా కూడా పోటీకి సిద్ధమై అన్ని ఎన్నికల్లో పోటీ చేసిన నేతగా రికార్డు సృష్టించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE