ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో ఖాళీ కానున్న 4 రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవలే ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 4 రాజ్యసభ స్థానాల ఎన్నికలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థుల పేర్లను మంగళవారం నాడు ప్రకటించింది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంపిక చేసిన అభ్యర్థుల వివరాలను పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో మంత్రి బొత్ససత్యనారాయణ మీడియాకు వెల్లడించారు. విజయసాయి రెడ్డి, న్యాయవాది నిరంజన్రెడ్డి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, బీద మస్తాన్రావు లను వైఎస్సార్సీపీ రాజ్యసభ అభ్యర్థులుగా ప్రకటించారు. వీరిలో పార్టీ కీలక నేత, ఎంపీ విజయసాయిరెడ్డిని మరోసారి రాజ్యసభకు పంపిస్తూ నిర్ణయం తీసుకోగా, మిగిలిన ముగ్గురు తొలిసారిగా రాజ్యసభ అవకాశం దక్కించుకున్నారు. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో వైఎస్సార్సీపీ బలాన్ని పరిగణిస్తే నాలుగు స్థానాలను కూడా పార్టీ అభ్యర్థులే దక్కించుకోనున్నారు.
ముందుగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ప్రభు సురేష్ ప్రభాకర్, టీజీ వెంకటేష్, యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి), వి.విజయసాయి రెడ్డి పదవీకాలం జూన్ 21, 2022తో పూర్తవనుండడంతో ఈ స్థానాలకు జూన్ 10వ తేదీన ఎన్నికలు జరుగుతాయని ఈసీ ప్రకటించింది. ఓట్ల లెక్కింపు పక్రియ కూడా అదే రోజున జరుగుతుందని తెలిపారు. ఇక రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణకు తుదిగడువు మే 31గా నిర్ణయించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF