ప్రముఖ నటుడు, రచయిత, బహుముఖ ప్రజ్ఞాశాలి గొల్లపూడి మారుతీరావు కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 80 సంవత్సరాలు. గొల్లపూడి మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం ఛాయలు నెలకున్నాయి. టాలీవుడ్కు చెందిన పలువురు సినీ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. గొల్లపూడి మారుతీరావు 1939 ఏప్రిల్ 14న విజయనగరంలో జన్మించారు. మొదట రేడియో వ్యాఖ్యతగా, సంపాదకుడిగా ప్రయాణం మొదలుపెట్టిన ఆయన డాక్టర్ చక్రవర్తి సినిమాతో రచయితగా సినిమా పరిశ్రమకు పరిచయమయ్యారు. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించగా చిరంజీవి కథానాయకుడిగా నటించిన ‘ఇంట్లో రామయ్య- వీధిలో కృష్ణయ్య’ సినిమాతో నటుడిగా మారిన ఆయన 280కి పైగా చిత్రాల్లో నటించారు. సినిమాలలో అన్ని రకాల పాత్రలు పోషించి, వాటిని తనదైన శైలిలో రక్తి కట్టించి ప్రేక్షకుల్లో గుండెల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆరు నంది అవార్డులు పొందారు.
సినిమా రంగంలోనే కాక, టీవీ రంగంలో పలు ధారావాహికల్లోనూ, పలు చర్చ కార్యక్రమాలుకు వ్యాఖ్యాతగానూ గొల్లపూడి వ్యవహరించారు. సినిమాల్లోకి రాకముందే నవలలు, కథలు, నాటకాలు రాసేవారు. తర్వాత కాలంలో కూడా ఆ అలవాటును కొనసాగిస్తూ వర్తమాన రాజకీయ వ్యవహారాలు, సినిమా, క్రీడలు వంటి పలు అంశాలపై పత్రికల్లో తనదైన చమత్కారంతో వ్యాసాలు రాసేవారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయినా గొల్లపూడి మారుతీరావు మృతిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గొల్లపూడి కుటుంబసభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమకు గొల్లపూడి ఎన్నో సేవలు అందించారని కొనియాడారు. గొల్లపూడి రచనలు తెలుగు భాషా అభివృద్ధికి దిశానిర్దేశం చేశాయని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు.