మాజీ ఎంపీ, వైసీపీ నాయకుడు వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సిట్ బృందం విచారణను కొనసాగిస్తుంది. గత కొన్ని రోజులగా ఎస్పీ అన్బురాజన్ నేతృత్వంలో ఈ కేసుకు సంబంధించి పలువురి కీలక వ్యక్తులను సిట్ బృందం విచారిస్తుంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు ఆదినారాయణ రెడ్డి ఈ రోజు విచారణకు హాజరయ్యారు. దర్యాప్తులో భాగంగా ఆదినారాయణ రెడ్డికి ఇప్పటికే నాలుగుసార్లు నోటీసులు జారీ చేశారు. ఆయనతో పాటుగా వైఎస్ వివేకానందరెడ్డి పీఏ కృష్ణారెడ్డి కూడా విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం ఆదినారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, వివేకానందరెడ్డి హత్య కేసుతో తనకు ఏ విధమైన సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించి పలు కోణాల్లో అడిగిన ముప్పై ప్రశ్నలకు వివరంగా సమాధానమిచ్చినట్టు తెలిపారు. ఈ కేసులో తన తప్పు ఉంటే బహిరంగంగా ఉరి తీయాలని చెప్పానన్నారు. వివేకాను ఎవరు హత్య చేశారో ప్రజలకు తెలుసని, కావాలనే ఇలా ప్రశ్నిస్తున్నారని అన్నారు. వివేకా హత్యపై సీబీఐతో విచారణ జరిపించాలన్న జగన్, సీఎం అయ్యాక ఎందుకు సిట్ వేశారని ప్రశ్నించారు. వెంటనే వివేకా హత్యకేసును సీబీఐకి అప్పగించాలి, అప్పుడే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని ఆదినారాయణరెడ్డి పేర్కొన్నారు.
[subscribe]