242 మంది ప్రయాణికులతో ఉక్రెయిన్ నుంచి బయలుదేరిన ప్రత్యేక ఎయిర్ ఇండియా విమానం నిన్న రాత్రి ఢిల్లీలో ల్యాండ్ అయింది. ఉక్రెయిన్లోని రెండు వేర్పాటువాద ప్రాంతాలను స్వతంత్ర దేశాలుగా గుర్తించినట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించిన తర్వాత పరిస్థితులు మరింతగా దిగజారాయి. ఉక్రెయిన్లో పెరుగుతున్న ఉద్రిక్తతలతో స్వదేశానికి తిరిగి వెళ్లడానికి వేలాది మంది భారతీయులు బిక్కు బిక్కుమంటూ ఎంతో ఆతృతగా వేచి చూస్తున్నారు. ఈ క్రమంలో భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక మిషన్ ‘వందే భారత్’ లో భాగంగా మొదటి విమానం నిన్న ఉక్రెయిన్ చేరుకుంది. ఉక్రెయిన్లోని ఇండియా రాయబార కార్యాలయం తాత్కాలికంగా విద్యార్థులను దేశం విడిచివెళ్ళమని సలహాలు జారీ చేసిన నేపథ్యంలో విమానంలో తిరిగి వచ్చిన వారిలో ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారు.
బోయింగ్ 787 విమానం ఉక్రెయిన్ రాజధాని కైవ్ నుండి సాయంత్రం 6 గంటలకు బయలుదేరి అర్ధరాత్రి ఢిల్లీకి చేరుకుంది. ఉక్రెయిన్ నుండి ఎయిరిండియా విమానం స్వదేశానికి రావడంతో ప్రయాణీకులు సంతోషిస్తున్నారు. విమానం ఢిల్లీలో ల్యాండ్ అవగానే ప్రయాణీకులు ఉత్సాహంగా చప్పట్లు కొడుతూ తమ ఆనందాన్ని తెలియజేశారు. మంగళవారం ల్యాండ్ అయిన దానితో పాటు, ఫిబ్రవరి 24 మరియు 26 తేదీలలో కైవ్ మరియు ఢిల్లీ మధ్య ఎయిర్ ఇండియా రెండు ప్రత్యేక విమానాలను నడుపుతోంది. అయితే, ఉక్రెయిన్కు విమానాలు నడిపే ఆలోచన తమకు లేదని ‘విస్తారా ఎయిర్ లైన్స్’ సీఈవో వినోద్ కన్నన్ నిన్న తెలిపారు. కాగా, కొన్ని ఇతర భారతీయ విమానయాన సంస్థలు డిమాండ్ను బట్టి ఉక్రెయిన్కు విమానాలను నడిపే అవకాశం ఉందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అధికారి తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ