కేరళలోని కోజికోడ్లో ఆగస్టు 7, శుక్రవారం రాత్రి ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 18 మంది మరణించగా, 100 మంది పైగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో కొలికోడ్ లో విమాన ప్రమాద ఘటనా స్థలాన్ని కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి పరిశీలించారు. అక్కడి పరిస్థితిని, సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారాన్ని అందజేస్తామని మంత్రి ప్రకటించారు. అలాగే తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50 వేల పరిహారం అందజేస్తామని చెప్పారు.
మరోవైపు ఈ ఘటనలో గాయపడి కోలికోడ్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్న వారిని కేరళ సీఎం పినరయి విజయన్, ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ పరామర్శించారు. ఇలాంటి ఘటనలు జరగడం విచారకరమని వారు పేర్కొన్నారు. అలాగే ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, ప్రభుత్వ అధికారులు స్పందించిన తీరును సీఎం విజయన్ మెచ్చుకున్నారు. ఓ వైపు వర్షం, కరోనా పరిస్థితులు ఉన్నా కూడా సహాయం చేసేందుకు ముందుకు వచ్చారని అన్నారు. ప్రమాద బాధితులకు రక్తదానం చేసేందుకు కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు క్యూ కట్టడం అభినందనీయమని సీఎం పినరయి విజయన్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu