దేశ అత్యున్నత పౌరపురస్కారం భారతరత్న మరో ముగ్గురిని వరించింది. దేశానికి సేవలందించిన మరో ముగ్గురు ప్రముఖులను కేంద్ర ప్రభుత్వం భారతరత్న పౌరపురస్కారంతో సత్కరించింది. ఇటీవల బీజేపీ అగ్రనేత ఎల్కే అడ్వానీ, బిహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకుర్లకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించింది. తాజాగా తెలంగాణ బిడ్డ, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్, చరణ్ సింగ్లకు కేంద్ర ప్రభుత్వం భారతర్న పురస్కారాన్ని ప్రకటించింది.
ఈ ఏడాది మొత్తం ఐదుగురు ప్రముఖులకు కేంద్రం భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది. ఆ అయిదుగురిలో నలుగురిని మరణానంతరం అవార్డు వరించింది. అవార్డుకు ఎంపికైన వారిలో కర్పూరీ ఠాకూర్, పీవీ నరసింహారావు, ఎంఎస్ స్వామినాథన్, చరణ్ సింగ్లు మరణించగా.. ఎల్కే అడ్వాణీ ఒక్కరు మాత్రమే జీవించి ఉన్నారు. ఇటీవల అవార్డు ప్రకటించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ఎల్కే అడ్వాణీని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
తాజాగా మరో ముగ్గురికి భారతరత్న అవార్డు ప్రకటించిన విషయాన్ని ప్రధాని మోడీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. దేశానికి వారు చేసిన సేవలను కొనియాడారు. రాజనీతిజ్ఞుడు పీవీ నరసింహారావు దేశానికి చేసిన సేవలు ఆపారమైనవని.. ఏపీ ముఖ్యమంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని మోడీ పేర్కొన్నారు. దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడంలో ఆయన నాయకత్వం బలమైన పునాది వేసిందని పేర్కొన్నారు. పీవీ హయాంలోనే భారత్ ప్రపంచ మార్కెట్ను ఆకర్షించిందని.. ఆర్థిక వృద్ధికి కొత్త శకం మొదలయిందని వివరించారు. ఆయనతో పాటు చరణ్ సింగ్, స్వామినాథన్లు దేశానికి చేసిన సేవలను మోడీ కొనియాడారు.
ఇకపోతే పీవీ నరసింహారావు వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లిలో 1921లో జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీ, నాగ్పూర్ యూనివర్సిటీల్లో విద్యాభ్యాసం పేర్తిచేసిన పీవీ.. స్వాతంత్రోద్యమంలో పాల్గొని దేశం కోసం పోరాడారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత ఏపీ ముఖ్యమంత్రిగా.. కేంద్ర మంత్రిగా నరసింహారావు పనిచేశారు. 1991-96 మధ్యలో భారత ప్రధానిగా కూడా ఆయన పనిచేశారు. ప్రధాని పదవి చేపట్టిన తొలి తెలుగు వ్యక్తిగా పీవీ నరసింహారావు చరిత్ర సృష్టించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE