దేశంలో ఉద్యోగులకు త్వరలో శుభవార్త అందనుంది. కొత్త లేబర్ కోడ్స్ కింద తమ ఉద్యోగులను వారంలో నాలుగు రోజులు పని చేయడానికి అనుమతించే అవకాశాన్ని దేశంలోని సంస్థలకు కేంద్ర ప్రభుత్వం త్వరలో అందించనున్నట్టు తెలుస్తుంది. కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర సోమవారం నాడు మీడియాతో మాట్లాడుతూ, కొత్త నిబంధన కింద వారానికి 48 గంటలు పని పరిమితి ఉంటుందని, 48 గంటలకు సంబంధించి ఉద్యోగులను పనిచేసే విధానాన్ని వారి అనుమతితో ఎంచుకోవడానికి సంస్థలకు మూడు ఎంపికలు ఉంటాయని చెప్పారు. ఉద్యోగులను 6 లేదా 5 లేదా 4 రోజులు పనిచేయడానికి సంస్థలు అనుమతించవచ్చు. రోజుకు 12 గంటల చొప్పున నాలుగు రోజులు, 10 గంటలు చొప్పున ఐదు రోజులు మరియు 8 గంటల చొప్పున 6 రోజులు పనిచేసేలా నిర్ణయం తీసుకోవచ్చు. అయితే కొత్త లేబర్ కోడ్ పై కేంద్రం ఇంకా కసరత్తు జరుపుతుంది. కేంద్రం నుంచి విధానపరమైన నిర్ణయం వెలువడాల్సి ఉంది.
వారానికి నాలుగు రోజులు పనిచేసే విధానం ఎంచుకుంటే మూడు రోజులు వీకాఫ్ (సెలవులు), అలాగే ఐదు రోజులు పనిచేసే వారికి వారానికి రెండు రోజుల వీకాఫ్, 6 రోజులు ఎంచుకుంటే ఒక రోజు వీకాఫ్ ను సంస్థలు ఇవ్వాల్సి ఉంటుందని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర వెల్లడించారు. అయితే సంస్థలను లేదా ఉద్యోగులను ఈ నిబంధనలను పాటించమని కేంద్రం బలవంతం చేయదని, పనిని సరళం చేయడం, దేశంలో మారుతున్న పని విధానంతో కలిసివెళ్లేందుకే ఈ నిబంధన తీసుకువస్తున్నట్లు చెప్పారు. తుది నిబంధనలలో మార్పులు ఉండే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ముందుగా కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ దేశంలో ముఖ్యంగా నాలుగు లేబర్ కోడ్స్ కింద కొత్త నిబంధనలను ఖరారు చేసే పనిలో ఉంది. ఇప్పటికే ప్రక్రియ ప్రారంభించగా, నిబంధనల రూపకల్పనలో సంబంధిత సంస్థలు, వర్గాలతో సంప్రదింపుల అనంతరం ప్రకటన చేసి, అమల్లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ