దక్షిణాఫ్రికాతో జరుగుతున్న నిర్ణయాత్మక మూడవ టెస్ట్లో టీమిండియా సారధి విరాట్ కోహ్లీ రికార్డు నెలకొల్పాడు. సఫారీ గడ్డపై అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి చేరాడు. ఈ క్రమంలో.. జట్టు కోచ్, మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ను వెనక్కునెట్టాడు. భారత బ్యాట్స్మన్ వరుసగా విఫలమైన చోట విరాట్ కోహ్లీ ఒక మంచి ఇన్నింగ్స్తో మెరిశాడు. తన బలహీనతగా మారిన ఆఫ్ స్టంప్నకు ఆవలి బంతులను వదిలేస్తూ సరికొత్త వ్యూహంతో బరిలోకి దిగాడు. అయితే పుజారా, పంత్ మినహా మరెవరూ కెప్టెన్కు అండగా నిలవలేకపోవడంతో తొలి ఇన్నింగ్స్లో భారత్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. భారత్ తొలి ఇన్నింగ్స్ 223 పరుగులకు ఆలౌట్ అయింది.
సెంచరీ చేసి రెండేళ్లు కావొస్తుండడంతో.. ఈసారి కచ్చితంగా సెంచరీ చేస్తాడు అనుకున్న సమయంలో 79 పరుగుల వద్ద రబడ బౌలింగ్లో వెర్రియేన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు కోహ్లీ. రెండేళ్లుగా టెస్టుల్లో సెంచరీ సాధించని కోహ్లీ అప్పటినుంచి ఆడిన టెస్టుల్లో అత్యధిక స్కోరు 74గా ఉంది. 2020 జనవరిలో అడిలైడ్ వేదికగా జరిగిన మ్యాచ్లో కోహ్లీ ఈ స్కోరు చేశాడు. తాజాగా కేప్టౌన్ వేదికగా సఫారీలతో జరుగుతున్న మూడో టెస్టులో.. 201 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్తో 79 పరుగులు సాధించాడు.
ఇక, దక్షిణాఫ్రికా గడ్డపై ద్రవిడ్ 11 టెస్ట్ల్లో 624 పరుగులు చేసి ఇప్పటివరకు రెండో స్థానంలో ఉన్నాడు. అయితే, ప్రస్తుత ఇన్నింగ్స్లో 14 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కోహ్లీ.. రాహుల్ ద్రవిడ్ ను అధిగమించాడు. ఈ జాబితాలో దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు. సచిన్.. 15 మ్యాచ్ల్లో 1161 పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికాలో ఇప్పటివరకు 7 టెస్ట్లు ఆడిన కోహ్లీ.. 50కి పైగా సగటుతో 690 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 3 అర్ధ సెంచరీలు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ