కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేస్తున్నట్టు లోక్సభ సెక్రటేరియట్ ప్రకటించిన విషయం తెలిసిందే. లోక్సభ సభ్యునిగా/ఎంపీగా రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడంతో ఆయన ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న కేరళలోని వయనాడ్ లోక్సభ స్థానం ఖాళీ అయినట్లుగా లోక్సభ సెక్రటేరియట్ వెల్లడించింది. రాహుల్ గాంధీపై అనర్హత వేటుతో 17వ లోక్సభలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సభ్యుల సంఖ్య 52 నుంచి 51 చేరినట్టు తెలిపారు. దీంతో 17వ లోక్సభలో మొత్తం మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు.
కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్ లోక్సభ స్థానంలో ఎన్సీపీ సభ్యుడు మహమ్మద్ ఫైజల్పై 2023, జనవరి 11న అనర్హత వేటు పడగా, కాంగ్రెస్ నేత సంతోఖ్సింగ్ చౌధరి ఆకస్మిక మరణంతో 2023, జనవరి 14 నుంచి పంజాబ్ లోని జలంధర్ స్థానం ఖాళీ అయింది. తాజాగా 2023, మార్చి 23 నుంచి రాహుల్ గాంధీపై కూడా అనర్హత వేటు అమల్లోకి రావడంతో కేరళలోని వయనాడ్ లోక్సభ స్థానం కూడా ఖాళీ అయిందని, మొత్తం మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ మూడు స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశముంది. కాగా కోర్టు తీర్పు నేపథ్యంలో ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం రాహుల్ గాంధీ 8 ఏళ్లపాటు ఎన్నికలకు దూరంగా ఉండాల్సి ఉండడంతో పోటీకి అనర్హుడు అయ్యే అవకాశం ఉంది. రాహుల్ గాంధీ ఉన్నత న్యాయస్థానంలో అప్పీలు చేసుకుంటే అనర్హత వేటు తొలగిపోయే అవకాశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
ముందుగా 2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఏప్రిల్ 13న కర్ణాటకలోని కోలార్లో జరిగిన లోక్సభ ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ, నీరవ్ మోదీ, లలిత్ మోదీ, నరేంద్ర మోదీ..ఇలా దొంగలందరికీ ఇంటి పేరు మోదీ అని ఉంది అంటూ వివాదాస్పద కామెంట్స్ చేశారు. దీంతో ప్రధాని మోదీ ఇంటి పేరు వాడి కించపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రాహుల్ గాంధీపై గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ సూరత్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. కాగా, ఈ నేరపూరిత పరువునష్టం కేసును విచారించిన అనంతరం సూరత్ కోర్టు గురువారం రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించి, రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. రాహుల్ అభ్యర్ధన మేరకు వ్యక్తిగత పూచికత్తుపై వెంటనే బెయిల్ మంజూరు చేసి, ఉన్నత న్యాయస్థానాల్లో అప్పీల్ చేసుకునేందుకు 30 రోజుల సమయం ఇచ్చింది. అయితే ఈ కేసులో దోషిగా తేలడం, 2 ఏళ్ల శిక్ష పడిన నేపథ్యంలో లోక్సభ సభ్యునిగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేస్తున్నట్టు లోక్సభ సెక్రటేరియట్ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది.
లోక్సభ సెక్రటేరియట్ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ నోటిఫికేషన్ విడుదల చేస్తూ, “నెం.21/4(3)/2023/TO(B) C.C./18712/2019లో సూరత్లోని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు అతనిని దోషిగా నిర్ధారించిన తర్వాత, కేరళలోని వయనాడ్ పార్లమెంటరీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్సభ సభ్యుడు రాహుల్ గాంధీ, ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 8తో పాటు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 102(1)(ఇ)లోని నిబంధనల ప్రకారం 2023 మార్చి 23న దోషిగా నిర్ధారించబడిన తేదీ నుండి లోక్సభ సభ్యత్వానికి అనర్హుడయ్యాడు” పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE