గడచిన పది రోజులుగా మహారాష్ట్ర రాజకీయాలలో కొనసాగుతున్న ఉత్కంఠకు బుధవారం ముగింపు పడింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సంచలన ప్రకటన చేశారు. సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. మహా వికాస్ అఘాడి (ఎంవిఎ) ప్రభుత్వానికి గురువారం అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించిన తర్వాత ఉద్ధవ్ ఈ నిర్ణయానికొచ్చారు. రేపు ఉదయం 11 గంటలకు బలపరీక్ష జరపాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో.. ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు. చివరి ప్రయత్నంగా సుప్రీం కోర్ట్ తలుపు తట్టినప్పటికీ, తీర్పు తనకు అనుకూలంగా రాకపోవడంతో ఉద్ధవ్ గౌరవంగా తప్పుకున్నారు.
ఈ సందర్భంగా ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ.. ‘నేను అధికారాన్ని అంటిపెట్టుకునే వాడిని కాదు. ఈ రోజు ఉదయం నుండి నా కార్యకర్తలకు పోలీసులు నోటీసులు పంపుతున్నారు. కేంద్ర బలగాలు ఇక్కడ ఉన్నాయి. ఆర్మీని కూడా రంగంలోకి దించే అవకాశం ఉంది. చైనా సరిహద్దుల్లో ఉండవలసిన సైనికులు ఇక్కడకు చేరుకుంటున్నారు. ముంబయి రోడ్లపై నా కార్మికుల రక్తం చిందించడాన్ని నేను చూడకూడదని అనుకుంటున్నాను. అందుకే ఈరోజు నేను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నాను’ అని ప్రజలను ఉద్దేశించి అన్నారు. అయితే ముఖ్యమంత్రి పదవితో పాటు శాసన మండలి సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. శివసేన సీనియర్ నేత, మంత్రి ఏక్నాథ్ షిండే తిరుగుబాటుతో దాదాపు మూడొంతులు పైగా ఎమ్మెల్యేలు ఆయన గూటికి చేరడంతో ప్రభుత్వం ప్రమాదంలో పడిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మహారాష్ట్ర అసెంబ్లీలో అత్యధిక బలం ఉన్న బీజేపీ షిండే మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ