దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తిపై నిఘా, నియంత్రణ, అప్రమత్తతలపై కేంద్ర ప్రభుత్వం జనవరి 27, బుధవారం నాడు నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మార్గదర్శకాలు ఫిబ్రవరి 1 నుంచి 28వ తేదీ వరకూ అమలు కానున్నాయి. కరోనాపై చేస్తున్న పోరాటంలో ఇప్పటికి సాధించిన గణనీయ ఫలితాలను సుస్థిరం చేసుకోవడమే ఈ మార్గదర్శకాల ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. దేశంలో గత నాలుగు నెలలుగా యాక్టీవ్ కేసులు, కొత్తగా నమోదయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా క్షిణిస్తుందని కేంద్రం పేర్కొంది. దీంతో కరోనా మహమ్మారిని పూర్తిగా నిర్మూలించే దిశగా అప్రమత్తత సహా నిఘా, నియంత్రణలకు సంబంధించి నిర్దేశించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసిజర్స్ (ఎస్ఓపీలు) ను తప్పనిసరిగా కఠినంగా పాటించడంపై అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ నూతన మార్గదర్శకాలను జారీ చేసింది.
కరోనాపై కేంద్రం జారీచేసిన కొత్త మార్గదర్శకాలు:
- కేంద్ర హోం, ఆరోగ్యశాఖల మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లా అధికారులు అవసరమైతే కంటైన్మెంట్ జోన్లను సూక్ష్మస్థాయిలో జాగ్రత్తగా గుర్తించి ప్రకటించాలి. ఆతర్వాత కంటైన్మెంట్ జోన్లలో నియంత్రణ చర్యలను కఠినంగా అమలు చేయాలి.
- కరోనా నియంత్రణ చర్యలు కచ్చితంగా అమలయ్యేలా ఆయా జిల్లా, పోలీసు, పురపాలక అధికారులు బాధ్యత వహించాలి. అలాగే సంబంధిత అధికారుల పనితీరుపై ఆయా రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు శ్రద్ధ చూపాలి.
- రాష్ట్రాలలో మాస్కులు ధరించటాన్ని, చేతుల పరిశుభ్రత ఉంచుకోడాన్ని, భౌతిక దూరాన్ని పాటించడాన్ని కచ్చితంగా అమలు చేయాలి. జాతీయ కోవిడ్-19 నిర్వహణ ఆదేశాలు దేశవ్యాప్తంగా కొనసాగించేలా చూసుకోవాలి.
- కంటైన్మెంట్ జోన్లకు వెలుపల అన్ని కార్యకలాపాలకూ ఆమోదం ఉంది. కానీ కొన్ని అంశాలకు మాత్రం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసిజర్స్ (ఎస్ఓపీలు) కు కచ్చితంగా కట్టుబడి ఉండాలి.
- సాంఘిక/మత/క్రీడలు/వినోదం/విద్యా/సాంస్కృతిక/మతపరమైన సమావేశాలు హాల్ సామర్థ్యంలో 50 శాతం, క్లోస్డ్ హాల్స్ లో గరిష్టంగా 200 మంది వ్యక్తులతో ఇప్పటికే అనుమతి ఇచ్చారు. అయితే ఇకపై వీటిపై రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల మార్గదర్శకాలకు అనుగుణంగా అనుమతి ఇచ్చే అవకాశం కల్పించారు.
- సినిమా హాళ్లు, థియేటర్లలో 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో నడిపేందుకు ఇప్పటికే అనుమతి ఇవ్వబడింది. అయితే ఇకపై మరికొంత అదనపు సామర్ధ్యంతో (ప్రేక్షకుల సంఖ్య పెంచేందుకు) అనుమతి ఉంటుంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖను సంప్రదించి త్వరలో కేంద్ర సమాచార-ప్రసార మంత్రిత్వశాఖ కొత్త మార్గదర్శకాలు జారీచేయనుంది.
- స్విమ్మింగ్ పూల్స్కు వెళ్లేందుకు క్రీడాకారులకే కాకుండా ఇకపై అందరికి అనుమతి ఉంటుంది. ఇందుకోసం కేంద్ర హోంశాఖను సంప్రదించి కేంద్ర యువజన-క్రీడా వ్యవహారాల శాఖ సవరించిన మార్గదర్శకాలను త్వరలో జారీ చేయనుంది.
- బిజినెస్ టు బిజినెస్ వ్యాపారుల ఎగ్జిబిషన్ హాల్స్ కు ఇప్పటికే అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఇకపై అన్నిరకాల ఎగ్జిబిషన్స్ కు అనుమతి ఉంటుంది.
- అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు అనుమతిపై కేంద్ర హోంశాఖను సంప్రదించి, పౌర విమానయాన మంత్రిత్వశాఖ పరిస్థితిని సమీక్షించి నిర్ణయం తీసుకుంటుంది.
- ప్రయాణ రైళ్ల రాకపోకలు, విమాన ప్రయాణం, మెట్రో రైళ్లు, ఉన్నత విద్యాసంస్థలు, హోటళ్లు-రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్సులు, వినోద పార్కులు, యోగా కేంద్రాలు, వ్యాయామశాలలు వంటి వాటికీ సంబంధించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసిజర్స్ (ఎస్ఓపీలు) ఎప్పటికప్పుడు అప్ డేట్ చేయబడతాయని, వీటిని కచ్చితంగా అమలయ్యేలా సంబంధిత అధికారవర్గాలే బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
- రాష్ట్రం లోపలగాని, అంతర్రాష్ట్ర కదలికలపై గాని ఆంక్షలు లేవు. రాష్ట్రం లోపలగాని, రాష్ట్రాల మధ్య గాని వ్యక్తుల రాకపోకలకు, సరకు రవాణాకు ఎలాంటి ఆంక్షలూ ఉండవు. అలాగే భూ-సరిహద్దుల పరిధిలోని పొరుగు దేశాలతోనూ వాణిజ్యంపై ఆంక్షలేవీ లేవు. ఎలాంటి ప్రత్యేకమైన అనుమతులు గాని, ఈ-పాస్ లు గాని అవసరం లేదు.
- 65 ఏళ్ల వయసు పైబడినవారు, దీర్ఘకాల వ్యాధులున్నవారు, గర్భిణులు, 10 ఏళ్ల లోపు పిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
- ఆరోగ్య సేతు మొబైల్ యాప్ వాడకాన్ని ఎప్పటిలాగే ప్రోత్సహించాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ