పంజాబ్ కాంగ్రెస్ లో కీలక నాయకుల మధ్య చోటుచేసుకున్న విబేధాలు కొనసాగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో ఇటీవలే పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ భేటీ అయిన సంగతి తెలిసిందే. తాజాగా శుక్రవారం నాడు మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ కూడా ఢిల్లీలో సోనియాగాంధీతో భేటీ అయ్యారు. ఈ భేటీకి కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పంజాబ్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి హరీష్ రావత్ కూడా హాజరైనట్లు తెలుస్తుంది. పంజాబ్ లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సీఎం అమరీందర్ సింగ్, నవజోత్ సింగ్ సిద్దూల మధ్య నెలకున్న విభేదాలను తొలగించేందుకు పార్టీ అధిష్టానం ప్రయత్నాలు ప్రారంభించింది.
ఈ క్రమంలో పంజాబ్ సీఎంగా అమరీందర్ సింగ్ ను కొనసాగిస్తూనే, పంజాబ్ పీసీసీ అధ్యక్ష పదవిని సిద్ధూకు అప్పజెప్పనున్నట్టు వార్తలు వినిపించాయి. ఈ నిర్ణయంపై సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ సానుకూలంగా లేరని, సిద్ధూ నేతృత్వంలో అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడలేమని అధిష్టానంతో పేర్కొన్నట్టు తెలుస్తుంది. అలాగే ఇరువురు నేతలు కూడా తమ సన్నిహితుల మంత్రులు, ఎమ్మెల్యేలతో భేటీ కావడంతో పంజాబ్ లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ నేపథ్యంలోనే సిద్ధూ ఢిల్లీ వెళ్లి, సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో భేటీ అయినట్టు తెలుస్తుంది. మరోవైపు సోనియా గాంధీతో సమావేశం అనంతరం హరీష్ రావత్ మీడియాతో మాట్లాడుతూ, పంజాబ్ రాజకీయ పరిణామాలపై నివేదికను సమర్పించడానికి ఇక్కడకు వచ్చానని, సోనియా గాంధీ ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని, తీసుకున్న వెంటనే మీడియాకు వెల్లడిస్తానని చెప్పారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ