ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం నాడు ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని భవిష్యత్తు అవసరాలను తీర్చగలిగే రెండు ఆయుర్వేద సంస్థలను దేశ ప్రజలకు అంకితం చేశారు. గుజరాత్ రాష్ట్రంలోని జామ్ నగర్ లో ఏర్పాటైన ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీచింగ్ అండ్ రిసర్చ్ ఇన్ ఆయుర్వేద (ఐటిఆర్ఎ), రాజస్థాన్ రాష్ట్రంలోని జయ్ పుర్ లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (ఎన్ఐఎ) సంస్థలును ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. అలాగే ఈ కార్యక్రమానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఒ) డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ గెబ్రెయెసస్ ఒక వీడియో సందేశం పంపి సాంప్రదాయక చికిత్సకు ప్రపంచ స్థాయి కేంద్రం ఏర్పాటుకు భారతదేశాన్ని ఎంపిక చేసినట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ డబ్ల్యుహెచ్ఒ కు ధన్యవాదాలు తెలిపారు. ఆయుర్వేదం అనేది భారతదేశ వారసత్వాలలో ఒకటని, ప్రస్తుతం భారతదేశ సాంప్రదాయక జ్ఞానం ఇతర దేశాలను కూడా సుసంపన్నం చేయడం సంతోషదాయకమైన విషయమని ప్రధాని అన్నారు.
ఆయుర్వేద ప్రత్యామ్నాయం మాత్రమే కాదు, దేశ ప్రజల ఆరోగ్యానికి కీలక ఆధారం:
కొత్తగా ప్రారంభమైన రెండు సంస్థలు అంతర్జాతీయ ప్రమాణాలకు తులతూగే విధంగా ఆయుర్వేద పాఠ్య క్రమాన్ని సిద్ధం చేస్తాయన్న ఆశాభావాన్ని ప్రధాని మోదీ వ్యక్తం చేశారు. ఆయుర్వేద ఒక ప్రత్యామ్నాయం మాత్రమే కాదని, దేశ ప్రజల ఆరోగ్యానికి ఒక కీలక ఆధారమని పేర్కొన్నారు. కరోనా సమయంలో ఆయుర్వేద ఉత్పత్తుల వినియోగం మరింత పెరగడంతో, ఆయుర్వేద ఉత్పత్తుల ఎగుమతులు దాదాపుగా 45 శాతం పెరిగాయని తెలిపారు. అలాగే ఆయుర్వేద రంగంలో రాబోయే కాలంలో మరిన్ని అంతర్జాతీయ పరీక్షలు కూడా మొదలవనున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ