దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతుండడంతో బాధితుల సంఖ్య శనివారం ఉదయానికి 3,08,993 కు చేరుకుంది. ఈ నేపథ్యంలో దేశంలో ప్రస్తుత కరోనా పరిస్థితులపై పీఎం నరేంద్ర మోదీ ఈ రోజు కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నీతిఆయోగ్ సభ్యుడు, ఎంపవర్డ్ గ్రూప్-1 చైర్మన్ డాక్టర్ వినోద్ పాల్ దేశంలో నెలకొన్న ప్రస్తుత కరోనా పరిస్థితులపై పీఎం మోదీకి వివరించినట్టు తెలుస్తుంది. అలాగే మొత్తం కేసులలో మూడింట రెండు వంతులు 5 రాష్ట్రాల్లో ఉన్నాయని, అదికూడా ఆ రాష్ట్రాల్లోని నగరాల్లోనే అధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయని చెప్పారు.
రోజువారీగా కరోనా కేసుల పెరుగుతుండడంతో పెద్ద నగరాలు సవాళ్లు ఎదుర్కొంటున్న దృష్ట్యా, కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పరీక్షలను పెంచడం మరియు పడకలు, ఆసుపత్రుల్లో సదుపాయాలు గురించి కూడా ఈ సమావేశంలో చర్చించారు. ఢిల్లీలో పరిస్థితులను లెఫ్టినెంట్ గవర్నర్, సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో హోమ్ మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి సమీక్షించాలని పీఎం మోదీ సూచించారు. ఈ సమావేశంలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్ష వర్ధన్, పలువురు కేంద్ర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu