కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ఉపయోగపడే వాక్సినేషన్ కార్యక్రమంలో భారత్ మరో అరుదైన ఘనత సాధించింది. కరోనా టీకా పంపిణీలో మనదేశం 150 కోట్ల మైలురాయిని చేరుకున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. పశ్చిమబెంగాల్ రాజధాని కోలకతాలో చిత్తరంజన్ నేషనల్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ రెండవ క్యాంపస్ ను నేడు ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రధాని మాట్లాడారు.
“ఈ రోజు భారత్ మరో చారిత్రక మైలురాయిని చేరుకుంది. ఇప్పటివరకు, దేశంలో 150 కోట్లకు పైగా డోసులను పంపిణీ చేశాం. టీకాలకు అర్హులైన వారిలో 90శాతానికి పైగా ప్రజలు తొలిడోసు తీసుకున్నారు. ప్రస్తుతం 15-18 ఏళ్ల వయసు వారికి కూడా టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. తొలి ఐదు రోజుల్లోనే 1.5 కోట్లకు పైగా టీనేజర్లు తొలి డోసు తీసుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం సమయానికి దేశవ్యాప్తంగా 150 కోట్లకు పైగా డోసులను పంపిణీ చేశారు” అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు.
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు దేశంలో గత సంవత్సరం జనవరి 16న వాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొదటి దశలో వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులకు.. ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు పైబడిన వారికి వాక్సినేషన్ ప్రారంభమైంది. మే 1 నుంచి 18 సం..లు పైబడిన పౌరులందరికి వ్యాక్సిన్ వేయడం మొదలుపెట్టారు. అయితే ఇటీవల ఒమిక్రాన్ రూపంలో దేశంలో కరోనా మళ్లీ ప్రబలుతోంది. దీంతో అప్రమత్తమైన కేంద్రం వాక్సినేషన్ ను సమర్ధవంతంగా నిర్వహిస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ