ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు (సెప్టెంబర్ 10, శనివారం) ఉదయం 10:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సెంటర్-స్టేట్ సైన్స్ కాన్క్లేవ్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మరియు కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పాల్గొన్నారు. అహ్మదాబాద్లోని సైన్స్ సిటీలో సెప్టెంబర్ 10,11 తేదీల్లో రెండు రోజుల పాటుగా ఈ కాన్క్లేవ్ నిర్వహించనున్నారు. ఈ కాన్క్లేవ్ లో సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ (ఎస్టీఐ) ఎకోసిస్టమ్ విజన్ 2047తో సహా వివిధ నేపథ్య రంగాలపై చర్చించనున్నారు. రాష్ట్రాలలో ఎస్టీఐ కోసం భవిష్యత్తు వృద్ధి మార్గాలు మరియు విజన్, డిజిటల్ హెల్త్ కేర్, 2030 నాటికి ఆర్ అండ్ డీ లో ప్రైవేట్ రంగ పెట్టుబడి రెట్టింపు, రైతుల ఆదాయాన్ని మెరుగుపరచడానికి సాంకేతిక మార్గాలు, త్రాగునీటిని ఉత్పత్తి చేసే ఆవిష్కరణ, హైడ్రోజన్ మిషన్లో ఎస్ అండ్ టీ పాత్రతో సహా అందరికీ క్లీన్ ఎనర్జీ, డీప్ ఓషన్ మిషన్ మరియు తీర ప్రాంత రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు, అలాగే దేశ భవిష్యత్తు ఆర్థిక వ్యవస్థలో దాని పాత్ర వంటి అంశాలపై చర్చించనున్నారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, ఈ కాన్క్లేవ్ నిర్వహణ సబ్కా ప్రయాస్కు స్పష్టమైన ఉదాహరణ అని అన్నారు. “21వ శతాబ్దపు భారతదేశం యొక్క అభివృద్ధిలో సైన్స్ ఓ శక్తి లాంటిది, ఇది ప్రతి ప్రాంత అభివృద్ధిని, ప్రతి రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేసే శక్తిని కలిగి ఉంది. నేడు భారతదేశం నాల్గవ పారిశ్రామిక విప్లవానికి నాయకత్వం వహిస్తున్నప్పుడు, భారతదేశం యొక్క సైన్స్ మరియు ఈ రంగానికి సంబంధించిన వ్యక్తుల పాత్ర చాలా ముఖ్యమైనది. అటువంటి పరిస్థితిలో, పరిపాలన, విధాన రూపకల్పనలో ప్రజల బాధ్యత గణనీయంగా పెరుగుతుంది” అన్నారు.
పరిష్కారాలు, పరిణామం, ఆవిష్కరణలకు సైన్స్ ప్రాతిపదిక అని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. ఈ స్ఫూర్తితోనే నేటి నవ భారతం జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్తో పాటు జై అనుసంధాన్తో ముందుకు సాగుతోందన్నారు. ప్రస్తుతం ఉన్న అనేక జాతీయ స్థాయి వైజ్ఞానిక సంస్థలు, జాతీయ ప్రయోగశాలల సామర్థ్యం మరియు నైపుణ్యాన్ని రాష్ట్రాలు పూర్తిగా ఉపయోగించుకోవాలని ప్రధాని సూచించారు. ఈ సెంటర్-స్టేట్ సైన్స్ కాన్క్లేవ్ ఒక కొత్త కోణాన్ని జోడిస్తుందని మరియు దేశంలో సైన్స్ పురోగతికి సంకల్పించగలదనే నమ్మకాన్ని ప్రధాని వ్యక్తం చేశారు. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ఏ అవకాశాన్ని జారవిడుచుకోవద్దని ప్రతి ఒక్కరినీ కోరారు. రాబోయే 25 సంవత్సరాలు భారతదేశానికి అత్యంత ముఖ్యమైన సంవత్సరాలని, అది రాబోయే భారతదేశం యొక్క కొత్త గుర్తింపు మరియు బలాన్ని నిర్ణయిస్తుందన్నారు. ఈ కాన్క్లేవ్ నుండి పాఠాలను వారి రాష్ట్రాలకు తీసుకెళ్లి, దేశ నిర్మాణానికి సహకరించాలని కూడా పాల్గొనేవారిని ప్రధాని మోదీ కోరారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY