దేశంలో పుల్వామా దాడి అనంతరం, భారత్ పాకిస్తాన్ మీద చేసిన సర్జికల్ స్ట్రైక్స్ లో భాగంగా పరాయి దేశంలో శత్రువులు చేతికి చిక్కినా కూడ అత్యంత ధైర్య సాహసాలు చూపించిన వింగ్ కమాండర్ (ప్రస్తుతం ఐఏఎఫ్ గ్రూప్ కెప్టెన్) అభినందన్ వర్థమాన్ ను భారత ప్రభుత్వం 2019లోనే ‘వీర్ చక్ర’ పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే. కాగా సోమవారం ఉదయం రాష్ట్రపతి భవన్ లో జరిగిన గ్యాలెంటరీ అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా అభినందన్ వర్థమాన్ వీర్ చక్ర అవార్డు అందుకున్నారు. అలాగే పలువురు జవాన్లకు శౌర్య చక్ర, కీర్తి చక్ర అవార్డులను రాష్ట్రపతి అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సహా పలువురు కేంద్రమంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ముందుగా ఫిబ్రవరి 26, 2019 బాలాకోట్ లో భారత్ పాకిస్తాన్ మీద చేసిన సర్జికల్ స్ట్రైక్స్ అనంతరం, పాకిస్తాన్ విమానాలు భారత్ పై దాడికి ప్రయత్నం చేసాయి. అటువంటి సమయంలో వింగ్ కమాండర్ గా ఉన్న అభినందన్ వర్థమాన్ తన మిగ్ జెట్ విమానంతో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఎఫ్-16 విమానాన్ని కూల్చివేసాడు, తర్వాత మిగ్ విమానం కూడ కూలిపోవడంతో అభినందన్ వర్థమాన్ పాక్ ఆక్రమిత కశ్మీర్ లో దిగాడు. అక్కడి స్థానికులు పట్టుకుని పాకిస్తాన్ సైన్యానికి అప్పగించారు, అంతర్జాతీయ దేశాల నుండి పాకిస్తాన్ మీద ఒత్తిడి పెరగడంతో మూడు రోజుల తరువాత పాకిస్తాన్ అధికారికంగా సరిహద్దు వద్ద భారత్ కు అప్పగించింది. ఎటువంటి సైనిక రహస్యాలు వెల్లడించకుండా చూపిన తెగువకు అభినందన్ ను దేశ ప్రజలు ఎంతో మెచ్చుకున్నారు. దీంతో జవాన్లకు పరమ వీర చక్ర, మహా వీరచక్ర తరువాత ఇచ్చే మూడో అత్యున్నత వీర్ చక్ర పురస్కారానికి అభినందన్ వర్థమాన్ ను కేంద్రం ఎంపిక చేసింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ