పార్లమెంట్ హౌస్లో రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తర్వాత దేశ 15వ రాష్ట్రపతిగా ఎవరు పీఠం అధిష్టిస్తారో మరికొన్ని గంటల్లోనే తేలనుంది. కాగా గురువారం ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. అధికారంలో ఉన్న ఎన్డీయే జార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్మును నామినేట్ చేయగా, విపక్షాలు తమ ఉమ్మడి అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హాను రంగంలోకి దించాయి. అయితే అధికార పార్టీకి ఉన్న సంఖ్యాబలం నేపథ్యంలో ముర్ముకే గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి.
ఈ క్రమంలో ముందుగా ఎంపీ ఓట్లను లెక్కించగా ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము ముందంజలో ఉన్నారు. పోలైన మొత్తం 763 ఓట్లలో ద్రౌపది ముర్ముకు 540, యశ్వంత్ సిన్హాకు 208 ఓట్లు వచ్చాయని, 15ఓట్లు చెల్లలేదని రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీ మీడియాకు తెలిపారు. ఈ సాయంత్రం 4 గంటలకు తుది ఫలితం వెలువడనుంది. ఒకవేళ ముర్ము ఎన్నికైనట్లయితే, దేశంలోనే అత్యున్నత రాజ్యాంగ పదవిని అధిరోహించిన మొదటి గిరిజన మహిళగా రికార్డు నెలకొల్పనున్నారు. కోవింద్ పదవీకాలం జులై 24తో ముగుస్తుండగా, కొత్త రాష్ట్రపతి జూలై 25న ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ