ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం నాడు ఢిల్లీలో జమ్మూకశ్మీర్ పై అఖిలపక్ష సమావేశం జరగనుంది. జమ్మూ కశ్మీర్ లోని పలు ప్రధాన పార్టీల నేతలకు ఈ సమావేశానికి ఆహ్వానం అందింది. జమ్మూకశ్మీర్ సమస్యలపైనే కీలకంగా చర్చించనున్నట్టు తెలుస్తుంది. ఈ సమావేశానికి నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ పరూఖ్ అబ్దుల్లా, జమ్మూకశ్మీర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జీఏ మిర్, మాజీ ముఖ్యమంత్రి, కీలక నేత గులాంనబీ ఆజాద్, తారా చంద్, పీడీపీ అధ్యక్షురాలు, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ, జమ్మూకశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు రవీందర్ రైనా, మాజీ ఉపముఖ్యమంత్రి కవీందర్ గుప్తా, నేషనల్ పాంథర్స్ పార్టీ అధ్యక్షుడు భీమ్ సింగ్ సహా పలువురు కీలక నేతలు హాజరుకానున్నారు. ముఖ్యంగా జమ్మూకశ్మీర్ కు తిరిగి రాష్ట్ర హోదాను పునరుద్ధరించడం,స్పెషల్ స్టేటస్ వంటి అంశాలనే ఈ సమావేశంలో లేవనెత్తాలని జమ్మూకశ్మీర్ నేతలు భావిస్తున్నట్లు సమాచారం.
ముందుగా కేంద్రప్రభుత్వం ఆగస్టు 5, 2019న జమ్మూ కశ్మీర్ లో ఆర్టికల్-370 రద్దు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో భాగంగా అక్టోబర్ 31, 2019 నుంచి ఒకే రాష్ట్రంగా ఉన్న జమ్మూ కశ్మీర్ రెండు (జమ్మూ కశ్మీర్ మరియు లద్ధాఖ్) కేంద్రపాలిత ప్రాంతాలుగా (యుటిలు) విభజించబడింది. భవిష్యత్తులో అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొన్నాక తిరిగి జమ్మూ కశ్మీర్ కు రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని లోక్ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పలుమార్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరుగుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ