దేశవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలకు సంబంధించి 2020-21 విద్యా సంవత్సరానికి గానూ డిగ్రీ, పీజీ మొదటి సంవత్సరం తరగతులను నవంబర్ 1 వ తేదీ నుంచి ప్రారంభించాలని, అలాగే అక్టోబర్ 31 నాటికి అడ్మిషన్ ప్రక్రియ పూర్తి చేయాలని యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో డిగ్రీ, పీజీ కాలేజీలను డిసెంబర్ 1 నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. రాష్ట్ర యూనివర్సిటీల వైస్-ఛాన్సలర్లతో ఆన్లైన్ సమావేశం నిర్వహించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు పశ్చిమ బెంగాల్ విద్యాశాఖ మంత్రి పార్థా ఛటర్జీ వెల్లడించారు. నవంబర్ నెలలో లక్ష్మీ పూజ, కాళీ పూజ, దీపావళి, భాయ్ దూజ్, చాట్ పూజ మరియు మిలాద్ ఉన్-నబీ వంటి అనేక పండుగలు ఉన్నాయి. నవంబర్ నెల నుంచి విద్యాసంవత్సరాన్ని ప్రారంభించి, ఈ పండుగల కారణంగా సెలవులు పాటించడం కన్నా, కొత్త విద్యా సంవత్సరాన్ని డిసెంబర్ నుండి ప్రారంభించడం అనువైనదిగా నిర్ణయించామని పేర్కొన్నారు.
మరోవైపు రాష్ట్రంలో ఇప్పటికే చాలా యూనివర్సిటీల్లో ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయని అన్నారు. అక్టోబర్ 31 నాటికి డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు ముగించి, నవంబర్ చివరి నాటికి పీజీ కోర్సుల్లో ప్రవేశ ప్రక్రియ ముగించనున్నట్టు తెలిపారు. అలాగే రాష్ట్ర విద్యాశాఖ యూజీసీ కు లేఖ రాస్తుందని, డిసెంబర్ నుండి కొత్త విద్యా సంవత్సరాన్ని ప్రారంభించడానికి రాష్ట్రానికి అనుమతి ఇవ్వాలని కోరనుందని మంత్రి పార్థా ఛటర్జీ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu