అక్టోబర్ 8న భారత వాయుసేన (ఐఏఎఫ్) దినోత్సవం సందర్భంగా ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ను తలపించే దృశ్యాలతో కూడిన ప్రొమో వీడియోను విడుదల చేసారు. ఈ వీడియోలో పుల్వామాలో ఉగ్రవాదులు చేసిన దాడులను వివరిస్తూ, అందుకు దీటుగా భారత వాయుసేన ఎలా ప్రతిస్పందించింది అనే విషయాలను ప్రదర్శిస్తూ వాయిస్ ఓవర్ తో వీడియోను రూపొందించారు. ఫిబ్రవరి 26, 2019న మిరాజ్-2000 జెట్ విమానాలు బాలాకోట్ ప్రాంతంలోని జైష్ ఎ మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధించిన శిబిరాలను ధ్వంసం చేసాయి. ఈ వీడియోను పాక్ భూబాగంలో బాంబులు జారవిడిచే దృశ్యాలతో రూపొందించారు. పీవోకేలో అలజడి సృష్టించేందుకు పాకిస్థాన్ వేల మందికి శిక్షణ ఇస్తూ కుట్రలు పన్నుతోందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో భారత వాయు సేన చీఫ్ భదౌరియా ఈ వీడియో విడుదల చేయడం విశేషం.ఈ సందర్భంగా పాకిస్తాన్ తో యుద్ధం చేసేందుకు భారత వాయుసేన సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. ఇప్పటికైనా చొరబాట్లు ప్రయత్నాలు ఆపకపోతే మళ్ళీ బాలాకోట్ దాడులు పునరావృతమవుతాయని పాకిస్తాన్ ను హెచ్చరించారు.
[subscribe]