మనీ లాండరింగ్ కు సంబంధించిన కేసులో కర్ణాటక కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి డీకే శివకుమార్ ను సెప్టెంబర్ 3న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన కస్టడీలో భాగంగా తీహార్ జైలులో ఉంటున్నారు. అక్టోబర్ 23, బుధవారం నాడు కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పార్టీ నేత అంబికా సోని, డీకే సోదరుడు సురేష్ తో కలిసి పరామర్శించారు. కష్టకాలంలో పార్టీ ఆయనకు అండగా ఉంటుందని సోనియా గాంధీ భరోసా ఇచ్చినట్టు తెలుస్తుంది. సోనియాగాంధీ కంటే ముందుగా సీనియర్ కాంగ్రెస్ నేతలైన అహ్మద్ పటేల్, ఆనంద్ శర్మలు డీకే శివకుమార్ను కలిసి చర్చించారు. మరోవైపు డీకే దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ పై ఈ రోజు ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇవ్వనుంది.
కర్ణాటకలో ఎన్నికల అనంతరం కాంగ్రెస్-జేడీఎస్ల సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటులో డీకే శివకుమార్ కీలక పాత్ర పోషించారు. అయినా కర్ణాటకలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం కారణంగా కుమారస్వామి ప్రభుత్వం ఏంతో కాలం అధికారంలో కొనసాగలేక పోయింది. మనీ ల్యాండరింగ్ కేసులో డీకే శివకుమార్ ను అరెస్ట్ చేసిన తరువాత అతని సోదరుడు డీకే సురేష్, ఆయన కుమార్తె ఐశ్వర్యను సైతం ఈడీ అధికారులు ప్రశ్నించారు. వీరితో పాటు డీకే శివకుమార్ తల్లికి, భార్యకు కూడ ఈడీ సమన్లు జారీ చేసింది.
[subscribe]