నవంబర్ 13, బుధవారం నాడు సుప్రీం కోర్టు మరో సంచలన తీర్పు వెలువరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) కార్యాలయం సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం పరిధిలోకే వస్తుందని స్పష్టం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. సీజేఐ కార్యాలయం కూడా ప్రభుత్వ సంస్థ అని, పారదర్శకత అనేది న్యాయవ్యవస్థ స్వేచ్ఛకు భంగం కాదని కోర్టు ప్రకటించింది. సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలో జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ డి.వై.చంద్రచూడ్ తో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ కీలక తీర్పును వెలువరించింది.
సీజేఐ కార్యాలయం కూడా సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తుందంటూ 2010 జనవరిలో ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ పిటిషన్ పై విచారణ జరిపి గత ఏప్రిల్ 4న తీర్పును రిజర్వు చేసింది. ఈ రోజు తుది తీర్పు ఇస్తూ 2010 జనవరిలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు ధర్మాసనం సమర్థించింది. సీజేఐ కార్యాలయం సమాచార హక్కు చట్టం పరిధిలో ఉండొచ్చని, న్యాయవ్యవస్థపై పరిశీలనకు సమాచార హక్కు చట్టం ఒక సాధనంగా ఉపయోగపడాలని కోర్టు అభిప్రాయపడింది.
[subscribe]