కర్ణాటక జట్టు సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీని మరోసారి గెలుచుకుంది. డిసెంబర్ 1, అదివారం నాడు తమిళనాడుతో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో 1 పరుగు తేడాతో కర్ణాటక జట్టు సంచలన విజయం సాధించింది. ముందుగా టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేసిన కర్ణాటక ఐదు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. కర్ణాటక కెప్టెన్ మనీష్ పాండే (45 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 60 నాటౌట్) అర్ధ శతకంతో సత్తాచాటగా, ఆర్పీ కదమ్ (28 బంతుల్లో 35; 5 ఫోర్లు), దేవదత్ (23 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) పరుగులతో రాణించారు. తమిళనాడు బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్, మురుగన్ అశ్విన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన తమిళనాడు జట్టు ఆరు వికెట్లు కోల్పోయి 179 పరుగులే చేయగలిగింది. బాబా అపరాజిత్ (25 బంతుల్లో 40; 1 ఫోర్, 3 సిక్సర్లు), విజయ్ శంకర్ (27 బంతుల్లో 44; 5 ఫోర్లు) పరుగులతో పోరాటం చేశారు. తమిళనాడు 80 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన దశలో వీరిద్దరూ ఫోర్లు, సిక్సర్లతో కర్ణాటక బౌలర్లపై విరుచుకుపడ్డారు. చివరి ఓవర్లో 6 బంతుల్లో 13 పరుగులుగా చేయాల్సి ఉండగా కృష్ణప్ప గౌతమ్ వేసిన తొలి రెండు బంతుల్లోనే అశ్విన్ రెండు ఫోర్లు కొట్టి జట్టును విజయానికి దగ్గర చేశాడు. అయితే తర్వాత రెండు బంతులకు ఒక పరుగే రావడం, ఐదో బంతికి రెండో పరుగుకు ప్రయత్నించి విజయ్ శంకర్ రనౌట్ అవ్వడంతో చివరి బంతికి మూడు పరుగులు సాధించాల్సి వచ్చింది. మురుగన్ అశ్విన్ ఆడిన చివరి బంతికి ఒక పరుగే రావడంతో, ఉత్కంఠగా సాగిన ఫైనల్లో తమిళనాడు పరుగు తేడాతో ముస్తాక్ అలీ ట్రోఫీ టైటిల్ను కోల్పోయింది. చివరి ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ చేసిన కృష్ణప్ప గౌతమ్ కర్ణాటక జట్టు విజయంలో కీలక పాత్ర పోషింశాడు.