భారత్-వెస్టిండీస్ మధ్య జరిగే మూడు టీ20ల సిరీస్ లో భాగంగా డిసెంబర్ 6, శుక్రవారం నాడు హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో మొదటి టీ20 మ్యాచ్ జరిగింది. ఈ టీ20లో భారత్ జట్టు ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ లో మరోసారి చెలరేగి ఆడాడు, కళ్ళు చెదిరే సిక్స్లు, ఫోర్లులతో భారత్ జట్టుకు టీ20లలో అత్యుత్తమ విజయాన్ని అందించాడు. 50 బంతుల్లోనే 94 పరుగురు సాధించిన కోహ్లీ ఈ ఫార్మాట్ లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ ను నమోదు చేశాడు. కోహ్లీ విజృంభణతో 18.4 ఓవర్లలోనే భారత్ జట్టు లక్ష్యాన్ని ఛేదించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 207 పరుగుల చేసింది. వెస్టిండీస్ ఆటగాళ్లలో హెట్మేయర్(56), ఎవిన్ లూయిస్(40), పొలార్డ్(37) పరుగులతో రాణించగా చివర్లో జాసన్ హోల్డర్(24) పరుగులు చేయడంతో వెస్టిండీస్ భారత్ జట్టుకు 208 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత బౌలర్లలో చహల్ రెండు పడగొట్టగా, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, దీపక్ చాహర్ తలో వికెట్ పడగొట్టారు.
తరువాత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు ప్రారంభంలోనే ఓపెనర్ రోహిత్శర్మ(8) వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ తనదైన శైలిలో రాణించాడు. మూడో స్థానంలో బ్యాటింగ్ కి వచ్చిన విరాట్ కోహ్లీతో కలిసి వంద పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించారు. వెస్టిండీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కోన్న కేఎల్ రాహుల్ (62 )పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక ముందు నెమ్మదిగా బ్యాటింగ్ చేసిన కోహ్లీ, ఆ తరువాత తన విశ్వరూపం చూపించాడు. 10 ఓవర్ల సమయంలో తను ఎదుర్కోన్న 20 బంతులకు 20 పరుగులు చేసిన కోహ్లీ, తరువాత ఎదుర్కోన్న 30 బంతుల్లో 74 పరుగులు సాధించాడు. మరోవైపు రిషబ్ పంత్ సైతం 18 పరుగులతో తన సహకారం అందించాడు. విండీస్ బౌలర్లలో పియర్ రెండు వికెట్లుతీయగా, పొలార్డ్, కాట్రెల్లు చెరో వికెట్ దక్కించుకున్నారు. భారత్-వెస్టిండీస్ మధ్య రెండో టీ20 డిసెంబర్ 8న తిరువనంతపురంలో జరగనుంది.