తెలంగాణ రాష్ట్రంలో అక్టోబర్ 5 నుంచి తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ ఉద్యోగులు 52 రోజుల పాటు సమ్మె చేపట్టిన సంగతి తెలిసిందే. సమ్మె సమయంలో మనోవేధనతో పలువురు ఉద్యోగులు ఆత్మహత్యా ప్రయత్నాలు చేసి ప్రాణాలు కోల్పోయారు. డిసెంబర్ 1న రాష్ట్రంలోని 97 డిపోలకు చెందిన ఆర్టీసీ ఉద్యోగులతో ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సమ్మె సమయంలో మృతిచెందిన ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాల్లో ఒకరికి అర్హతలను బట్టి ప్రభుత్వం ఉద్యోగం, రూ.2లక్షల ఆర్థికసాయం అందజేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మరణించిన ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబంలోని వ్యక్తులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు ఆర్టీసీ యాజమాన్యం ప్రక్రియ ప్రారంభించింది. సమ్మెకాలంలో జీహెచ్ఎంసీ పరిధిలో 10 మంది కార్మికులు మరణించారు. సీఎం కేసీఆర్ హామీ మేరకు ముందుగా కుటుంబానికి ఒక్కరు చొప్పున ఉద్యోగాలకు ఎంపిక చేశారు. పది కుటుంబాలకు చెందినవారిలో నలుగురికి జూనియర్ అసిస్టెంట్, ఐదుగురికి ఆర్టీసీ కానిస్టేబుళ్లు, ఒకరికి కండక్టర్గా ఉద్యోగాలిస్తున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తెలిపారు. ఈ మేరకు వారికీ ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు.
[subscribe]