ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గ్రేటర్లో నోట్ల వర్షమే కురుస్తోందన్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా నవంబర్ 30న జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థి తక్కువలో తక్కువ చూసుకున్నా.. రూ.50 నుంచి 75 కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి తప్పనిసరిగా మారింది. అంటే ఒక్కో నియోజకవర్గంలో చూసుకుంటే రూ.150 నుంచి 200 కోట్ల వరకు ఖర్చు కానుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇలా ఈ రేంజ్లో ఖర్చు పెట్టగలవారినే గ్రేటర్ హైదరాబాద్లోని నియోజకవర్గాలలో తమ తమ అభ్యర్థులుగా రాజకీయ పార్టీలు ఖరారు చేశాయి.
బస్తీ, రిజర్వ్ స్థానాలు తప్ప.. మిగిలిన నియోజకవర్గాల్లో ఈ సారి ఎన్నికలలో నోట్ల వరద పారనుందని ఎక్స్పర్స్ట్ చెబుతున్నారు. ఇప్పటికే ఓటర్లను ఆకర్షించడానికి అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు తాయిలాల పంపిణీ మొదలు పెట్టేసింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందు నుంచే ప్రతి రోజు కార్యకర్తలు, అనుచరుల బాగోగులు చూసుకోవడం పార్టీ తప్పనిసరి కార్యక్రమాలలో ఒకటిగా మార్చుకుంది. చివరకు పెట్రోల్ బంక్లలో పెట్రోల్, డీజిల్.. వైన్స్, బెల్ట్ షాపులలో మందును ముందు వాడుకుని..తర్వాత డబ్బులు ఇచ్చేలా ఆ యజమాన్యాలతో నేతలు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇవే కాకుండా.. నియోజకవర్గ కేంద్రంతో పాటు మండలం, వార్డుకు, పంచాయతీకి ఒక క్యాంపు ఆఫీసును ఏర్పాటు చేసి..అక్కడ పార్టీ శ్రేణులకు బ్రేక్ ఫాస్ట్ నుంచి రాత్రి విందు, మందు వరకు ఫ్రీగా ఉండేటట్లు చర్యలు తీసుకున్నారు.
ఒక విధంగా చెప్పాలంటే దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలు జరిగే ప్రాంతంగా తెలంగాణకు పేరుంది. అంతెందుకు 2022 నవంబర్లో జరిగిన మునుగోడు ఉప ఎన్నికలలోనే .. రెండు ప్రధాన పార్టీలు రేంజ్లో పోటాపోటీగా ఖర్చు పెట్టాయి. రెండు పార్టీలు కలిపి ఒక్కో ఓటుకు రూ.10 వేల వరకూ ఒక్కో ఓటర్కు అందించినట్లు, అలా మునుగోడు బై ఎలక్షన్ల సమయంలో మొత్తంగా రూ.600 కోట్లకు పైగానే ఖర్చు చేసినట్లు రాజకీయ వర్గాలలో అప్పట్లో పెద్ద ఎత్తున చర్చే జరిగింది.
దీనికి తోడు హ్యాట్రిక్ సాధించాలనే పట్టుదలతో బీఆర్ఎస్, ఓటర్లలో వచ్చిన మార్పును గమనించిన హస్తం పార్టీ.. ఈ అవకాశాన్ని ఎలా అయినా చేజిక్కించుకోవాలని ఆరాట పడుతోంది. ఈ రెండిటితో పోల్చుకుంటే బీజేపీ బలంగా లేకపోయినా..తమ హవా ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకోవడానికి కాషాయ పార్టీ నేతలు ఈ ఎన్నికలను ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితులలో వచ్చే నవంబర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో అధికారం చేజిక్కించుకోవడానికి ప్రధాన రాజకీయ పార్టీలు ఎంతైనా ఖర్చు చేయడానికి వెనకాడట్లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. పార్టీ టికెట్ ఇచ్చిన అభ్యర్థులంతా ఆర్థికంగా బలమైన అభ్యర్థులు కావడమే దీనికి నిదర్శనమన్న వాదన వినిపిస్తోంది. సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ చెప్పిన దాని ప్రకారం.. ఈమధ్య కర్నాటక శాసనసభ ఎన్నికలలోనూ రాజకీయ పార్టీలు, అభ్యర్థులు రూ.9,500 కోట్ల నుంచి రూ.10,500 కోట్ల మధ్య ఖర్చు చేశాయని తెలిపింది. 2013 ఎన్నికల వ్యయం కంటే ఇది రెండింతలని తెలిపింది.
ప్రస్తుతం తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలు ఓటర్లను వర్గాల వారీగా విభజించి.. వారిని ఆకట్టుకునే పనిలో పడ్డాయి. మహిళలకు చీరలు, వెండి, బంగారం వంటి బహుమతులే కాకుండా.. కుట్టు మిషన్లు, కుక్కర్లు, మిక్సీలు వంటి గృహోపకరణాలను అందిస్తుంటే… యూత్ను ఆకట్టుకోవడం కోసం గిఫ్ట్ కూపన్లు, క్రికెట్ కిట్ వంటి ఆట వస్తువుల పంపిణీతో పాటు, డ్రైవింగ్ లైసెన్స్ వంటి సేవలను కూడా అందిస్తున్నారు.అంతేకాదు వీరికి ఎలక్ట్రిక్ స్కూటర్లు,స్మార్ట్ ఫోన్లు బహుమతులుగా ఇస్తున్నారు. వృద్ధుల కోసం వైద్య శిబిరాలు, వారి కుటుంబాలకు దీపావళి బహుమతులు, బాణాసంచాలు అందిస్తున్నారు.
హైదరాబాద్, అంబర్ పేట్, బహదుర్ పుర, చాంద్రాయనగుట్ట,చార్మినార్, గోషా మహల్, యాకత్ పుర, జూబ్లీ హిల్స్ ,కార్వాన్,ఖైరతాబాద్ ,మలక్ పేట్ , ముషీరాబాద్ , నాంపల్లి , సనత్ నగర్,మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్,సికింద్రాబాద్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, మేడ్చల్ , ఉప్పల్, మెదక్, చేవెళ్ల వంటి కాస్ట్లీ నియోజకవర్గాల వైపు ఇప్పుడు నేతల చూపు పడింది. మరోవైపు గ్రేటర్లో ఎక్కువ ఓటర్లు ఉన్న నియోజకవర్గాలపై అన్ని రాజకీయ పార్టీలు దృష్టి పెట్టినట్లే..ఎన్నికల సంఘం కూడా ప్రత్యేక దృష్టి సారించింది. రానున్న ఎన్నికలలో ముఖ్యంగా హైదరాబాద్,రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలోని ఈ 19 నియోజక వర్గాలలో సగటున ఐదు లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ ఓటింగ్ శాతం తక్కువే అయినా కూడా.. రాజకీయ పార్టీలు ఖర్చు పెట్టే సొమ్ము మాత్రం ఎక్కువగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
నిజానికి ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధన ప్రకారం.. ఒక్కో అభ్యర్థి రూ.40 లక్షలకు మించి ఖర్చు చేయకూడదు. ప్రజా ప్రాతినిధ్య చట్టం–1951లోని సెక్షన్–77 ప్రకారం.. ఎన్నికలలో నిలబడ్డ అభ్యర్థి తన ఎన్నికల ఖర్చులకు సంబంధించి ప్రత్యేకంగా కరెంట్ అకౌంట్ను తెరవాలి. వ్యయ, నిర్వహణ రికార్డులను తర్వాత ఎన్నికల కమిషన్కు సమర్పించాల్సి ఉంటుంది. కానీ భూతద్దం పెట్టి వెతికినా కూడా ..ఈ నిబంధన అమలు అయినట్లు ఎక్కడా కనిపించదు. పైగా అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల సంఘం నిర్ణయించిన దాని కంటే కూడా గెలుపునే ప్రధాన లక్ష్యంగా చేసుకున్న అభ్యర్ధులు వంద రెట్లు ఎక్కువ ఖర్చు చేస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి, ఇతర ఎన్నికల నిర్వహణ కోసం ఖర్చు చేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ