సేవతోనే జీవితానికి అసలైన పరమార్థం లభిస్తుందని, ప్రజలను కష్టకాలంలో ఆదుకున్న వాళ్ళే అసలైన నాయకులని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ మంచినీటివ సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకోవాలని ప్రజాప్రతినిధులకు మంత్రి ఎర్రబెల్లి పిలుపునిచ్చారు. పాలకుర్తి సామాజిక ఆరోగ్య కేంద్రంలో పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల మండలాలకు ఉపయోగ పడేవిధంగా ఏర్పాటు చేసిన అత్యాధునిక సదుపాయాల అంబులెన్స్ వాహనాన్ని సంబంధిత వైద్యాధికారులకు మంత్రి అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, ఓట్లప్పుడే కాకుండా, కరోనా వైరస్ విస్తృతి కష్ట కాలంలోనూ ప్రజలను ఆదుకోవాలన్నారు. ఇప్పటి వరకు తనకు తోచిన విధంగా నిత్యావసర సరుకులు, మాస్కులు, సానిటైజర్లు పంపిణీ చేశామన్నారు. ఇదే తరహాలో ఇప్పుడు తాజాగా ఆక్సీజన్, వెంటిలేటర్లు ఉండే అత్యాధునిక అంబులెన్స్ వాహనాన్ని ప్రజలకు 24 గంటల పాటు అందుబాటులో ఉండే విధంగా అందిస్తున్నామని చెప్పారు. ఈ వాహనం ద్వారా అత్యవసర సేవలు అవసరమైన కరోనా బాధితులను ఆదుకోవాలని వైద్యాధికారులకు మంత్రి సూచించారు. కరోనా అనంతరం ప్రజలకు ఉపయోగించాలని చెప్పారు. టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కె టి రామారావు తన పుట్టిన రోజు సందర్భంగా ఇచ్చిన పిలుపులో భాగంగా గిఫ్ట్ ఎ స్మైల్ కింద వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి 14 వాహనాలను ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. అందులో పాలకుర్తి నియోజకవర్గానికి రెండు వాహనాలను, ఒకటి పాలకుర్తి, రెండోది తోర్రూరులో అందుబాటులో ఉండే విధంగా ఇస్తున్నట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి పాలకుర్తి సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. హాస్పిటల్ ని పరిశీలించారు. హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న పోస్టు ఆపరేషనల్ వార్డులోని మహిళలను పరామర్శించారు. ఎలా ఉన్నారని అడిగారు. వాళ్ళకు కేసీఆర్ కిట్లను పంపిణీ చేశారు. అంతకుముందు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాజీ రాష్ట్రపతి దివంగత ప్రణబ్ ముఖర్జీ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఆయన సేవలను కొనియాడారు.
కరోనా బాధితుల కోసం పాలకుర్తి పిఆర్ ఎఇ నెల వేతనం విరాళం:
కరోనా బాధితుల కోసం పాలకుర్తి పంచాయతీరాజ్ ఎఇ మమ్మద్ గౌస్ పాషా తన నెల రోజుల వేతనాన్ని విరాళంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు అందచేశారు. పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల మండలాలకు అందుబాటులో ఉండే విధంగా, పాలకుర్తి సామాజిక ఆరోగ్య కేంద్రానికి అంబులెన్స్ వాహనాన్ని అందించిన సందర్భంగా తన విరాళానికి సంబంధించిన చెక్కుని మంత్రికి పాషా అందచేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఔదార్యాన్ని చాటిన పాషా ని అభినందించారు. తమకు తోచిన విధంగా దాతలు ముందుకు వచ్చి పేదలను ఆదుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా పిఆర్ ఎఇ పాషా మాట్లాడుతూ, కరోనా వైరస్ వచ్చిన కొత్తలోనే మంత్రి దయాకర్ రావు కోట్లాది రూపాయల నిత్యావసర సరుకులను నిరుపేదలకు అందించారన్నారు. అలాగే ఇప్పుడు మాస్కులు, సానిటైజర్లు అందిస్తుండటమే గాక, అంబులెన్స్ వాహనాలను కూడా ఇస్తున్నందున ఆయనకు ఉడతా భక్తిగా, ప్రజలకు ఉపయోగించడానికి వీలుగా తన నెల వేతనాన్ని విరాళంగా ఇచ్చామన్నారు. ఇందుకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని స్ఫూర్తిగా తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu