అన్నిరంగాల్లో మోదీ సర్కార్ ఘోరంగా వైఫల్యం చెందిందని, తాను చేసిన వ్యాఖ్యలు తప్పని నిరూపిస్తే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి కుడా సిద్ధమని ప్రకటించారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఈ మేరకు ఆయన ఆదివారం బడ్జెట్ సమావేశాల చివరి రోజున అసెంబ్లీలో కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పాలనలో దేశం యావత్తూ అనేక బాధలు పడుతోందని, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం పట్ల మోదీ ప్రభుత్వం వివక్ష చూపుతోందని మండిపడ్డారు. అందుకే వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించి మోదీని ఇంటికి పంపించాలని ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు.
అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తూ.. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రతిష్టను భావితరాలకు తెలియజేసేలా, చిరస్థాయిగా ఉండేలా రాష్ట్ర సచివాలయానికి ఆయన పేరు పెట్టామని పేర్కొన్నారు. తెలంగాణలో ప్రజలను గెలిపించి చూపించామని, ఇక దేశంలో కూడా ప్రజలను గెలిపించి చూపిస్తామని చెప్పారు. దేశంలో జనాభా గణన ఎందుకు చేపట్టడం లేదు? అని ఆయన కేంద్రాన్ని నిలదీశారు. అభివృద్ధి గురించి మాట్లాడే హక్కే మోదీకి లేదని, ఆయన పాలనలో అభివృద్ధి దేనిలో పెరిగింది? సామాన్య ప్రజల జీవితాల్లోనా? లేక అదానీ ఆస్తుల్లోనా? అని ప్రశ్నించారు. దేశంలో పెరిగింది ఒక్కటేనని.. అది అభివృద్ధి కాదని, అప్పులు చేయడం అని ఎద్దేవా చేశారు. మన రాష్ట్రానికి కనీసం ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదని, కేంద్రం అసంబద్ధ విధానాలతో రాష్ట్రానికి రూ.3 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని ఆయన ఆరోపించారు. ఇక దేశం మొత్తం అదానీ విషయం గురించి మాట్లాడుతుంటే, పార్లమెంట్లో ప్రధాని మోదీ దీనిపై ఒక్క మాట మాట్లాడరా? దేశ సంపద రూ.10 లక్షల కోట్లు ఆవిరైతే కనీసం స్పందించారా? అని కేసీఆర్ నిలదీశారు.
ఇంకా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. కేంద్రంలో కిసాన్ సర్కార్ వస్తేనే రైతుకు మేలు జరుగుతుంది, ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి, పాలనపై అవగాహన ఉన్న ప్రధాని ఉంటే దేశవ్యాప్తంగా రైతులకు నిరంతరం విద్యుత్తు అందించవచ్చని పేర్కొన్నారు. దేశంలో అందుబాటులో ఉన్న నదీజలాలు సుమారు 75 వేల టీఎంసీలు ఉంటాయని, దీనిలో మనం వాడుకుంటున్నది కేవలం 20-21వేల టీఎంసీలు మాత్రమేనని చెప్పారు. వృథాగా సముద్రంలో కలుస్తున్న నీటిని ప్రాజెక్టులు నిర్మించడం ద్వారా సమర్ధవంతంగా వినియోగించుకోవచ్చని తెలియజేశారు. దేశ వార్షిక వృద్ధిరేటు క్షీణించిందని, అలాగే తలసరి ఆదాయం వృద్ధిరేటు దారుణంగా సగానికి సగం పడిపోయిందని వెల్లడించారు. మునుపటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుతంతో పోలిస్తే మోదీ హయాంలో వివిధ రంగాల్లో దేశం పరిస్థితి దిగజారిపోయిందని, ఇది తాను చెప్తున్నది కాదని, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) ఇచ్చిన నివేదికలోనే ఉందని ఆయన స్పష్టంచేశారు. ఇక తాను చెప్పిన వాటిల్లో ఏ ఒక్క తప్పున్నా.. వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE