తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కీలక ప్రకటన చేశారు. జాతీయ పార్టీ పేరు ‘భారత్ రాష్ట్ర సమితి’ (బీఆర్ఎస్)గా ఖరారు చేస్తూ టీఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశం (జనరల్ బాడీ మీటింగ్)లో తీర్మానం చేశారు. కాగా ఈ తీర్మానాన్ని పార్టీ నేతలందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఇక ఈ తీర్మానంపై సీఎం కేసీఆర్తో పాటు 283 మంది టీఆర్ఎస్ ప్రతినిధులు సంతకాలు చేశారు. కాగా ఈ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితులుగా కర్ణాటక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి మరియు ‘విదుతాలై చిరుతైగల్ కట్చె’ (విసికె) పార్టీ అధినేత, చిదంబరం పార్లమెంట్ సభ్యుడు, ప్రముఖ తమిళ దళితనేత తిరుమవలవన్ లు హాజరయ్యారు. వీరితోపాటు మొత్తం 8 రాష్ట్రాలకు చెందిన కీలక నేతలు పాల్గొన్నట్లు సమాచారం.
‘తెలంగాణ రాష్ట్ర సమితి’ (టీఆర్ఎస్) పేరుని ‘భారత్ రాష్ట్ర సమితి’ (బీఆర్ఎస్)గా మారుస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సీఎం కేసీఆర్ ప్రకటించడాన్ని సభ్యులందరూ హర్షధ్వనాలతో ఆహ్వానించారు. ‘భారత్ రాష్ట్ర సమితి’ (బీఆర్ఎస్) పేరు తెలుగువారితో పాటు హిందీ రాష్ట్రాల ప్రజలకూ సులువుగా చేరుతుందని ఆయన భావించినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. హిందీలో ‘భారతదేశ సమితి’ అనే అర్ధంలో కూడా పిలువబడుతుందని సీఎం కేసీఆర్ ఈ పేరుని ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. కాగా టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తూ తీసుకున్న నిర్ణయం మేరకు సీఎం కేసీఆర్ కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియజేస్తూ లేఖ పంపారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది.
దీనికి ముందు సీఎం కేసీఆర్ దసరా పండుగ సందర్భంగా బుధవారం ఉదయం ప్రగతి భవన్ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నల్ల పోచమ్మ ఆలయంలో సీఎం కేసీఆర్ దంపతులు, కుటుంబ సభ్యులు పూజలు నిర్వహించి, జమ్మి వృక్షానికి సాంప్రదాయబద్దంగా పూజలు చేశారు. అనంతరం పవిత్ర జమ్మి ఆకును అక్కడ హాజరైన వారందరికీ పంచిన సీఎం పరస్పర శుభాకాంక్షలు అందించారు. ప్రగతి భవన్ లో సీఎం కెసిఆర్ వేద పండితుల సమక్షంలో ఆయుధ పూజ నిర్వహించగా, దీనికి ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, సిఎంవో అధికారులు, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY