వందపూలు వికసించేందుకు, వేయి ఆలోచనలు సంఘర్షించేందుకు పుస్తక ప్రదర్శనలే వేదికలని తెలంగాణ ఐటీ, పరిశ్రమల, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. అన్ని రంగాలలో అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణను జ్ఞాన తెలంగాణగా నిర్మించేందుకు పుస్తకాలు పనిముట్లుగా పనిచేస్తాయని తెలిపారు. చరిత్రను వక్రీకరించే వాళ్లను గుర్తించాలంటే అసలు చరిత్రను అవగతం చేసుకోవాలంటే విధిగా ఈతరం పుస్తకపఠనం కొనసాగించాలని ఉద్భోదించారు. నేటి నుంచి (డిసెంబర్ 22, గురువారం) ప్రారంభమయ్యే హైదరాబాద్ బుక్ ఫెయిర్/35వ జాతీయ పుస్తక ప్రదర్శన పోస్టర్ ను ప్రగతిభవన్ లో మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ జ్ఞాన ఆయుధంతో సత్యాగ్రహి మార్గంలో 14 ఏళ్లు రాష్ట్ర సాధన మహోద్యమాన్ని కొనసాగించి రాష్ట్రాన్ని సాధించారన్నారు. పుస్తకాలు తయారుచేసిన వ్యక్తులే ఏ రంగంలోనైనా అత్యున్నత స్థానాలకు ఎదగగలుగుతున్నారు. జ్ఞానమార్గంలో వచ్చిన అనేక శాస్త్ర సాంకేతిక విప్లవాల వల్లనే జాతులు, దేశాల పురోభివృద్ధి ఆధారపడి ఉంటుందన్నారు. ఒక సమాజం అత్యున్నత స్థాయికి ఎదిగి మార్గదర్శకంగా నిలబడటానికి పుస్తకాలు ఇచ్చిన జ్ఞానమే పునాదిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు సాధించిన ప్రగతికి ఇంకా సాధించవలసిన పురోగతికి మేధో సంఘర్షణల నుంచి జనించిన ఆలోచనలన్నింటిని భద్రంగా రికార్డు చేసి ప్రపంచం చేతికందించేది పుస్తకాలేనని వివరించారు.
భిన్న సంస్కృతుల, భిన్న భాషల వేదికగా, మినీ ఇండియాగా విలసిల్లుతున్న హైదరాబాద్ నగరంలో భిన్న భాషా సంస్కృతుల పుస్తకాలు కేంద్రంగా హైదరాబాద్ బుక్ ఫెయిర్ నిలిచిందని చెప్పారు. మనిషిని మనిషి ప్రేమించే వ్యవస్థను నిర్మించటానికి, ఉత్తమ సంస్కారవంతులను తయారుచేసే జ్ఞాన కర్మాగారమైన పుస్తక ప్రదర్శనను హైదరాబాద్ లో 35 ఏళ్లుగా విజయవంతంగా కొనసాగటం ఈ మట్టి చైతన్యానికి నిదర్శనమని తెలిపారు. పోటీ పరీక్షలకు తయారయ్యే విద్యార్థులకు నూతన ఆలోచనల పొదుగుగా నిలిచిన పుస్తక ప్రదర్శనను ఉపయోగించుకోవాలని యువతను కోరారు. తెలంగాణ తనను తాను పునర్నిర్మించుకుంటూ అభివృద్ధిని సాధిస్తూ మతసామరస్యానికి ప్రతీకగా ముందుకు సాగుతున్నట్లుగానే బుక్ ఫెయిర్ కూడా సర్వజనుల ఆకాంక్షలకు ఐక్యతకు ప్రతిరూపంగా నిర్వహించబడాలని మంత్రి కేటీఆర్ హితవు పలికారు.
హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో తాను కూడా ఒకరోజు పాల్గొంటానని, నూతనంగా వస్తున్న పుస్తకాలను అధ్యయనం చేసేందుకు బుక్ ఫెయిర్ అంతా కలియ తిరుగుతానని బుక్ ఫెయిర్ అధ్యక్షులు జూలూరు గౌరీశంకర్ కు తెలిపారు. బుక్ ఫెయిర్ ను ప్రజల దగ్గరకు తీసుకపోతున్న నిర్వాహకులందర్నీ మంత్రి కేటీఆర్ హృదయపూర్వకంగా అభినందించారు. పుస్తక ప్రదర్శనలు విజయవంతంగా వెలుగొందాలని మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్, బుక్ ఫెయిర్ అధ్యక్షులు జూలూరు గౌరీశంకర్, డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్, మాజీ మేయర్ బొంతు రాంమ్మోహన్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిర్వాహకులు రాఘవ తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE