తెలంగాణ శాసనసభలో శుక్రవారం హరితహారంపై చర్చలో భాగంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో కొనసాగుతున్న తెలంగాణకు హరితహారం కార్యక్రమంకు తోడ్పాటుగా హరిత నిధి ఏర్పాటుపై ప్రతిపాదన చేశారు. హరిత నిధిని సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించాలని సీఎం కోరారు. హరిత నిధి కోసం ప్రతి నెల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రూ.500 జమ చేయనున్నట్టు తెలిపారు. టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంగీకరించారని, మిగతా పక్షాలకు కూడా ముందుకు రావాలని కోరారు. ప్రతి నెల ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఆఫీసర్లు రూ.100, ప్రభుత్వ ఉద్యోగులు రూ. 25 ఇచ్చేలా ప్రతిపాదన చేశామన్నారు.
అలాగే హరిత నిధి కోసం విద్యార్థులను కూడా భాగస్వామ్యులను చేసే ఆలోచన ఉందని, వారు స్కూల్స్, కళాశాలల్లో ప్రవేశాలు పొందే సమయంలో స్కూల్ విద్యార్థులు అయితే రూ.5, హైస్కూల్ విద్యార్థులు రూ. 15, ఇంటర్ విద్యార్థులు రూ.25, డిగ్రీ విద్యార్థులు రూ.50, ప్రొఫెషనల్ కోర్సులు చదివే విద్యార్థులు రూ.100 చొప్పున హరిత నిధికి జమ చేసేలా ప్రతిపాదిస్తున్నామన్నారు. ఇక లైసెన్సె రెన్యూవల్ చేసే సమయంలో రూ.1000, భూముల రిజిస్ట్రేషన్ సమయంలో హరిత నిధి కింద రూ.50 జమ చేసేలా చూస్తామన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణకు హరితహారం కార్యక్రమం నిరంతరాయంగా సాగేందుకు హరిత నిధిని ఏర్పాటు చేయడం పట్ల సీఎం కేసీఆర్ కు రాష్ట్ర అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, సీఎస్ సోమేశ్ కుమార్, సీఎం సెక్రటరీ భూపాల్ రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (అటవీశాఖ) శాంతి కుమారి, పిసీసీఎఫ్ ఆర్.శోభ, సిఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, అటవీశాఖ ఉన్నతాధికారులు ధన్యవాదాలు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ