తెలంగాణ వైతాళికులు స్వర్గీయ సురవరం ప్రతాపరెడ్డి 125వ జయంతి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆయన సేవలను స్మరించుకున్నారు. పత్రికా సంపాదకుడిగా, రచయితగా, తెలంగాణ జాతి సాహితీ కీర్తిని దశదిశలా వ్యాపింపజేసిన రాజకీయ, సాంఘిక, సాహిత్య వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి అని సీఎం కొనియాడారు. పురాణాలను, చరిత్రను, సామాజిక చైతన్యాన్ని, సాహితీ సృజనను వినూత్న కోణంలో ఆవిష్కరించి, తెలంగాణ వైభవాన్ని లోకానికి సాధికారికంగా సత్ప్రమాణాలతో సురవరం ప్రతాపరెడ్డి నిరూపించారని సీఎం పేర్కొన్నారు. ‘గోలకొండ పత్రిక’ ద్వారా వారు తీసుకొచ్చిన జన చైతన్యం స్ఫూర్తిదాయకమైనదన్నారు.
హిందూ జీవన విధానంలో అంతర్భాగమైన పండుగలు, సాంప్రదాయాల్లో నిగూఢంగా ఉన్న విలువలను శాస్త్రీయంగా వెలుగులోకి తెచ్చి, రామాయణంలోని ఎన్నో తెలియని కోణాలను సోదాహరణంగా వివరించి, తెలుగు ప్రజల సాంఘిక చరిత్రను ఆధారాలతో సహా నమోదుచేసిన ఘనత బహుముఖ ప్రజ్ఞాశాలి సురవరంకే దక్కిందని అన్నారు. తెలంగాణలో పండితులు, పద్యకవులు లేరనే మాటను సవాలుగా తీసుకొని ‘గోలకొండ కవుల సంచిక’ను ప్రత్యేకంగా ముద్రించారాన్నారు. తద్వారా, తెలంగాణ ఆత్మగౌరవ పతాకాన్ని ఎగరేసి తెలంగాణ సాహితీ వైభవాన్ని నిరూపించిన అచ్చమైన తెలంగాణవాది, తెలంగాణ స్ఫూర్తిని రగిలించిన తేజోమూర్తి సురవరం అని సీఎం తెలిపారు. తెలంగాణ తేజోమూర్తి సురవరం ప్రతాపరెడ్డి తన రచనలు కార్యాచరణ ద్వారా తెలంగాణ సమాజానికి అందించిన స్ఫూర్తి తెలంగాణ భవిష్యత్తు తరాలకు ఆదర్శనీయమన్నారు. సురవరం 125వ జయంతి (మే 28) ఉత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఏడాదిగా నిర్వహిస్తున్నదని సీఎం కేసీఆర్ తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ