తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. మూడో రోజైన బుధవారం నాడు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సభలో పలు కీలక అంశాలపై మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తిపై కన్నేసి ఉంచామని, కరోనా నియంత్రణకు అవసరమైన అన్ని జాగ్రత్తలను వైద్యారోగ్య శాఖ తీసుకుంటుందని చెప్పారు. గత కొన్ని రోజులుగా మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్నాయని అన్నారు. ముఖ్యంగా కొన్ని గురుకుల హాస్టళ్లల్లో మరియు పాఠశాలల్లో విద్యార్థులు కరోనా బారినపడుతున్నారని, దీనిపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి తగిన చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. కేంద్రం నుంచి ఎప్పటికప్పుడు సూచనలు వస్తున్నాయని, కరోనా అదుపులో ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడతామని అన్నారు.
అసెంబ్లీ వేదికగా పీఆర్సీపై ప్రకటన:
అలాగే ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీపై కూడా సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీ వేదికగా రెండు, మూడు రోజుల్లోనే పీఆర్సీపై ప్రకటిస్తామని చెప్పారు. గతంలో ప్రకటించిన పీఆర్సీతోనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై ప్రభుత్వానికి ఎంత ప్రేమ ఉందో చూపించామన్నారు. తాజా పీఆర్సీ ప్రకటన తరువాత కూడా ఉద్యోగులు సంతృప్తి వ్యక్తం చేస్తారని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ముగియడంతో ఇక ఉద్యోగుల పీఆర్సీపై ప్రకటన ఉంటుందన్నారు. 57 ఏళ్ళు పైబడినవారికీ పెన్షన్ అందించే అంశంపై కూడా త్వరలోనే ప్రకటన చేస్తామని చెప్పారు. అదేవిధంగా నిరుద్యోగ భృతి విధివిధానాలపై కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుందని తెలిపారు. ఇక కరోనా వ్యాప్తితో ప్రభావం ఉన్నప్పటికీ కూడా రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ఎక్కడా నిధులు ఆపలేదని చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో రాష్ట్రవ్యాప్తంగా పల్లెలు, పట్టణాల రూపులేఖలే మారిపోయానని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ వందకు వంద శాతం చేసి తీరుతాం:
మరోవైపు రేషన్ కార్డులకు సంబంధించిన ప్రశ్నకు సమాధానమిస్తూ 2014 సంవత్సరం కంటే ముందు రాష్ట్రంలో 29 లక్షల రేషన్ కార్డులుండేవని, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో రేషన్ కార్డులు సంఖ్య 39 లక్షలకు దాటిందని చెప్పారు. అప్పుడు రూ.200 పెన్షన్ ఇస్తే ప్రస్తుతం 39,36,520ల మందికి రూ.2016 చొప్పున పెన్షన్ ఇస్తున్నామని అన్నారు. అలాగే రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ వందకు వంద శాతం చేసి తీరుతామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. 25 వేల వరకు రుణాలు ఉన్నవారికి గత సంవత్సరం మాఫీ చేశామని, మిగతా వారికి సంబంధించిన రుణమాఫీ అంశంపై రేపు ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రకటన చేస్తారని చెప్పారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ