కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఈ రోజు సీఎల్పీ కార్యాలయంలో ఆర్టీసీ అంశంపై మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ సమ్మె సమస్య తీరిపోయిందనుకుంటే, చార్జీలు పెంచుతూ సీఎం కేసీఆర్ మరో సమస్యను తెరమీదకి తెచ్చారని జగ్గారెడ్డి విమర్శించారు. ఆర్టీసీకి వెయ్యి కోట్ల రూపాయలు ఇస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్, మరోవైపు టికెట్ల చార్జీలు పెంచి ఆ భారమంతా ప్రజలపై మోపారన్నారు. పెంచిన ఆర్టీసీ ఛార్జీలను ప్రభుత్వం తక్షణమే ఉపసహరించుకోవాలని డిమాండ్ చేశారు. పెంచిన బస్సు టికెట్ చార్జీలను తగ్గించకపోతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తగ్గించి, ఆర్టీసీని కూడా ప్రభుత్వంలో విలీనం చేస్తామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో లోటు బడ్జెట్ ఉన్నా కూడా చార్జీలు పెంచలేదని, పైగా సీఎం వైఎస్ జగన్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారని గుర్తు చేశారు. మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీని విలీనం చేయకపోగా, ఛార్జీలు పెంపుతో ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. రూ.2లక్షల కోట్లు అప్పు తెచ్చి కాళేశ్వరం కడితే ఏం లాభం జరిగిందని, ప్రతి ఏటా 11 వేల కోట్లు వడ్డీలే చెల్లిస్తున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు.
[subscribe]