ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి రంగంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ‘హోన్ హాయ్ ప్రిసిషన్ ఇండస్ట్రీ కంపెనీ లిమిటెడ్ (ఫాక్స్కాన్ టెక్నాలజీ గ్రూప్) సంస్థ ఛైర్మన్ యంగ్ లియూ నేతృత్వంలోని ప్రతినిధి బృందం మార్చి 2న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో ప్రగతి భవన్ లో సమావేశం అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఫాక్స్కాన్ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వానికి నడుమ ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఫాక్స్కాన్ సంస్థ పెట్టుబడులు పెట్టడానికి సంబంధించి ఛైర్మన్ యంగ్ లియూ తాజాగా సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలోని కొంగరకలాన్లో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఫాక్స్కాన్ సంస్థ కట్టుబడి ఉందని యంగ్ లియూ సీఎం కేసీఆర్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు మరియు సీఎం ఆతిథ్యానికి ధన్యవాదాలు తెలిపారు.
“హైదరాబాద్ పర్యటన సందర్భంగా నాకు, నా బృందానికి మీరిచ్చిన ఆతిథ్యానికి ముందుగా, నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. హైదరాబాద్ లో మేము అద్భుతమైన సమయాన్ని గడిపాము. నాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేస్తూ మీరు స్వదస్తూరితో రాసి గ్రీటింగ్ కార్డు ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. తెలంగాణ పరిణామం, అభివృద్ధి కోసం మీరు చేస్తున్న కృషి, మీ దార్శనికత నాలో స్ఫూర్తిని నింపింది. భారతదేశంలో నాకో కొత్త మిత్రుడు లభించాడు. భవిష్యత్తులో మీతో కలిసి పనిచేయాలనుకుంటున్నాను. మార్చి 2 వ తేదీన మీతో సమావేశం సందర్భంగా చర్చించినట్టు, త్వరలోనే కొంగరకలాన్ లో మా సంస్థ ఉత్పత్తులను ప్రారంభించడానికి ఫాక్స్కాన్ కట్టుబడి వుంది. ఈ దిశగా మేము చేపట్టబోయే కార్యాచరణలో మీరు సంపూర్ణ మద్దతునివ్వాలని కోరుతున్నాను. మీరు నా అతిథిగా తైవాన్ కు రావాల్సిందిగా ఈ సందర్భంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. తైపీ లో మీకు ఆతిథ్యమివ్వడం నాకు గౌరవంగా భావిస్తున్నాను. త్వరలోనే మీతో మరోసారి సమావేశానికి ఎదురుచూస్తున్నాను” అని సీఎం కేసీఆర్ కు రాసిన లేఖలో ఫాక్స్కాన్ సంస్థ ఛైర్మన్ యంగ్ లియూ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE