ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగింది. ఏపీలోని మొత్తం 18 ఎమ్మెల్సీ అభ్యర్ధుల భర్తీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం గత నెల 27న ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శాసన మండలిలో ఈ నెలాఖరుకు ఖాళీ అవుతున్న ఏడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ మేరకు సోమవారం ఏపీ శాసనమండలి సంయుక్త కార్యదర్శి, ఎన్నికల రిటర్నింగ్ అధికారి సుబ్బారెడ్డి ఫారమ్-1 ద్వారా నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసే అభ్యర్ధులు స్వయంగా కానీ లేదా వారి ప్రతిపాదకుల ద్వారా అయినా సరే వెలగపూడిలోని రాష్ట్ర శాసనసభా భవనంలో రిటర్నింగ్ అధికారి వద్ద లేదా సహాయ రిటర్నింగ్ అధికారి, శాసనమండలి ఉప కార్యదర్శికి నామినేషన్లు సమర్పించవచ్చని రిటర్నింగ్ అధికారి సుబ్బారెడ్డి తెలిపారు.
ఈ నేపథ్యంలో ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకూ నామినేషన్లు స్వీకరిస్తామని, ఈ నెల 14న ఉదయం 11 గంటలకు నామినేషన్ల పరిశీలన చేపడుతామని తెలిపారు. అలాగే 16వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకూ నామినేషన్ల ఉప సంహరణకు గడువు ఉంటుందని, ఎన్నికలకు ఈ నెల 23వ తేదీ ఉదయం 9 గంటల నుండి 4 గంటల వరకూ అసెంబ్లీలో పోలింగ్ జరుగుతుందని చెప్పారు. ఇక పోలింగ్ ప్రక్రియ పూర్తైన వెంటనే అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు జరుగుతుందని, తుది ఫలితాలు వచ్చాక విజేతల పేర్లను వెల్లడిస్తామని శాసనమండలి సంయుక్త కార్యదర్శి సుబ్బారెడ్డి వివరించారు.
కాగా శాసన మండలిలో సభ్యులుగా ఉన్న చల్లా భగీరథ రెడ్డి పదవీ కాలం గత నెల నవంబర్ 2వ తేదీతో పూర్తికాగా, ప్రస్తుత ఎమ్మెల్సీలు నారా లోకేశ్, పోతుల సునీత, బచ్చుల అర్జునుడు, డొక్కా మాణిక్య వరప్రసాద్, వరహా వెంకట సత్యనారాయణ రాజు పెనుమత్స, గంగుల ప్రభాకర రెడ్డిల పదవీ కాలం ఈ నెల 29వ తేదీతో ముగియనున్నది. అయితే వీరిలో వైసీపీకి చెందిన చల్లా భగీరథ రెడ్డి అనారోగ్యంతో గత కొన్ని నెలల క్రితమే మరణించగా, తాజాగా టీడీపీ నేత బచ్చుల అర్జునుడు కూడా కన్నుమూశారు. కాగా 18 ఎమ్మెల్సీ స్థానాలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తమ అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. మొత్తం 18 ఎమ్మెల్సీ స్థానాలకు గానూ 11 బీసీలకు, 2 ఎస్సీలకు, 1 ఎస్టీలకు, 4 ఓసీలకు కేటాయించారు.
సీఎం జగన్ ప్రకటించిన ఎమ్మెల్యే కోటా వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు:
- పెనుమత్స సూర్యనారాయణ – విజయనగరం – (ఓసీ-క్షత్రియ)
- కోలా గురువులు – విశాఖపట్నం – (బీసీ-వడ బలిజ)
- బొమ్మి ఇజ్రాయిల్ – డా.బీఆర్ అంబెడ్కర్ కోనసీమ – (ఎస్సీ-మాదిగ)
- జయమంగళ వెంకటరమణ – ఏలూరు – ( బీసీ-వడ్డీ)
- చంద్రగిరి ఏసు రత్నం – గుంటూరు -(బీసీ-వడ్డెర)
- పోతుల సునీత – బాపట్ల – (బీసీ- పద్మశాలి)
- మర్రి రాజశేఖర్ – పల్నాడు – (ఓసీ-కమ్మ)
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE