హైదరాబాద్ నగరంలో వర్షాలు, వరదలు వలన పెద్ద ఎత్తున పేరుకుపోయిన చెత్తను, బురదను తొలగించడానికి 737 ప్రత్యేక వాహనాలను, అదనంగా పనిచేసే సిబ్బందిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ముమ్మరంగా పారిశుధ్య కార్యక్రమాలను జీహెచ్ఎంసీ చేపడుతుంది. ఇందుకుగాను కొత్తగా నియమించిన 2500 మంది కార్మికులతో పాటు జీహెచ్ఎంసీకి చెందిన 23 వేల మంది పారిశుధ్య, ఎంటమాలజి సిబ్బంది ఈ ముమ్మర పారిశుధ్య కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ లో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల నీటమునిగిన 235 కాలనీలలో, నగరంలోని ప్రధాన రహదారుల్లో పేరుకే పోయిన వ్యర్థాలు, బురదను మొత్తం తొలగించేందుకు రానున్న పదిరోజుల పాటుగా ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని చేపట్టాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటిఆర్ ఆదేశించడంతో మిషన్ మోడ్ తో జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్యక్రమాలు చేపడుతోంది.
దీంతో పెద్ద ఎత్తున చేపట్టిన కార్యక్రమాల్లో భాగంగా 737 పలు రకాల వాహనాల్ని ఇందుకోసం వినియోగిస్తోంది. ఇప్పటికే జీహెచ్ఎంసీ వద్ద ఉన్న 242 వాహనాలతోపాటు 495 కొత్తగా వాహనాలను ఏర్పాటుచేసింది. ఈ మొత్తం 737 వాహనాలలో 177 జెసిబీ లు, 26 బాబ్ కాట్, 258 టిప్పర్లు, 96 సిక్స్ టన్నర్లు, 126 పది టన్నర్లు, 44 ట్రాక్టర్లు నగరంలో ఇరవైనాలుగు గంటలు పనిచేస్తున్నాయి. వీటికి తోడు, 334 పంపుల ద్వారా సెల్లార్లలో, కాలనీలో పేరుకుపోయిన నీటిని తొలగించే ప్రక్రియ ముమ్మరంగా సాగుతొంది. ఇప్పటికే ఉన్న 1008 మంది వర్షాకాల అత్యవసర సిబ్బందితోపాటు ముమ్మరపారిశుధ్య కార్యక్రమాలకు అదనంగా 1522 మందిని ప్రత్యేకంగా నియమించారు. మొత్తం 2530 మంది నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో చెత్తను, బురదను తొలగించే కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు.
రూ.6 కోట్ల వ్యయంతో ముమ్మర పారిశుధ్య పనులు:
నగరంలో చేపట్టిన స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కు రూ. 5 ,51,94,400 లను ఇప్పటికే వ్యయం చేయగా, ఈ పదిరోజుల ఇంటెన్సివ్ స్పెషల్ డ్రైవ్ లో మరో ఆరు కోట్ల రూపాయల వరకు జీహెచ్ఎంసీ ఖర్చు చేయనుంది. ముఖ్యంగా తీవ్రంగా దెబ్బతిన్న కాలనీలపై ప్రత్యేక దృష్టితో ఈ శానిటేషన్ డ్రైవ్ ను చేపట్టారు. ఈ డ్రైవ్ లో రోజుకు దాదాపు పదివేల మెట్రిక్ టన్నుల అదనపు వ్యర్థాలను సేకరిస్తున్నారు. కాలనీల్లో చెత్త, వ్యర్థాలుంటే 9704601866 అనే నెంబరుకు వాట్సాప్ చేయాలని సూచించారు. వర్షాల వల్ల తీవ్రంగా ప్రభావితమైన కాలనీలు, బస్తీల్లో కేంద్రీకృత ముమ్మర పారిశుధ్య కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, అయితే కాలనీలు, బస్తీల్లో చెత్త, వ్యర్థాలుంటే సంబంధిత సర్కిళ్ల శానిటేషన్ అధికారికి నేరుగా ఫోన్ చేసి గాని, లేదా 9704601866 అనే నెంబరుకు వాట్సాప్ చేయాలని అధికారులు తెలిపారు. ఇప్పటికే, అనేక కాలనీల్లో వ్యర్థాలను పూర్తిగా తొలగించారు. ముఖ్యంగా సెల్లార్లలో నిండిన నీటిని యుద్ధ ప్రాతిపదికన తొలగించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu