తెలంగాణలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న జరిగే ఫార్ములా ఈ-రేస్కు ముందు హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ వద్ద నవంబర్ 19, 20 తేదీల్లో స్ట్రీట్ సర్క్యూట్ రేస్, ‘ఇండియన్ రేసింగ్ లీగ్’ జరగనుంది. దీంతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఎన్టీఆర్ మార్గ్ చుట్టూ నాలుగు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు విధించారు. కాగా ఈ ఆంక్షలు రేపటినుంచే అమలులోకి రానున్నాయి. ఫార్ములా-ఈ ప్రిక్స్ ఈవెంట్ను ప్రపంచంలోని పన్నెండు దేశాలు మాత్రమే నిర్వహిస్తుండగా అందులో భారత్ కూడా ఒకటి. ఇప్పుడు హైదరాబాద్లో జరగనున్నది ఈ ఈవెంట్కు సంబంధించిన తొమ్మిదవ సీజన్. సాధారణంగా ఫార్ములా వన్ రేసింగ్ ప్రత్యేకంగా తయారుచేసిన ట్రాక్ రోడ్లపై మాత్రమే నిర్వహిస్తారు. అయితే ఫార్ములా-ఈ ఈవెంట్ మాత్రం నగరంలోని సాధారణ రోడ్లపైనే నిర్వహించనున్నారు.
ఇక ఫార్ములా వన్ రేసింగ్ పట్ల ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ ఉండగా ఇండియాలో 2011లో మొదటిసారి నిర్వహించారు. అయితే ఇప్పుడు ఫార్ములా-ఈ పేరుతో తొలిసారి హైదరాబాద్లో జరపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. గ్లోబల్ సిటీగా గుర్తింపు పొందిన హైదరాబాద్ ఇప్పుడు లండన్, బెర్లిన్, రోమ్, సౌ పాలో, మెక్సికో, జకార్తా, కేప్ టౌన్, మొనాకో, దిరియా (సౌదీ అరేబియా) సరసన నిలవనుంది. రానున్న నాలుగు సంవత్సరాల వరకు ఈ ఈవెంట్ను హైదరాబాద్ లో నిర్వహించనున్నారు. 2014లో ప్రారంభమైన ఫార్ములా-ఈ రేసింగ్ ఇప్పటివరకు 100 రేసులను పూర్తి చేసుకుంది. హైదరాబాద్లో జరిగే ఈ ఈవెంట్ను హెచ్ఎండీఏ (హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ) బాధ్యులైన రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ ఆర్గనైజ్ చేస్తున్నారు. సంప్రదాయేతర ఇంధన వనరుల కంపెనీల్లో ఒకటైన గ్రీన్ కో ఈ ఈవెంట్ను ప్రమోట్ చేస్తోంది.
ఈ నేపథ్యంలో ఈ-రేసింగ్ నెక్లెస్ రోడ్ రోటరీ నుండి ప్రారంభమై, తెలుగు తల్లి జంక్షన్, కొత్త సెక్రటేరియట్ నుండి ఎన్టీఆర్ గార్డెన్ నుండి మింట్ కాంపౌండ్ మరియు ఐమాక్స్ వరకు కొనసాగుతుంది. ఫార్ములా ఈ-రేసింగ్ కారణంగా ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, నెక్లెస్ రోడ్ మరియు లుంబినీ పార్క్ శుక్రవారం నుండి సోమవారం వరకు మూసివేయబడతాయి. దీంతో అఫ్జల్గంజ్ నుండి సికింద్రాబాద్ వైపు వచ్చే ఆర్టీసీ బస్సులు ట్యాంక్ బండ్ రోడ్డును తప్పించి తెలుగు తల్లి ఫ్లైఓవర్, కట్ట మైసమ్మ, లోయర్ ట్యాంక్ బండ్, డీబీఆర్ మిల్స్ మరియు కవాడిగూడ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ప్రజలు దీనిని గమనించి ఈ మార్గాలను నివారించాలని నగర ట్రాఫిక్ పోలీసులు కోరారు.
వాహనదారులకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచించిన మార్గాలు..
- ఖైరతాబాద్ నుండి ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వైపు వెళ్లే వాహనాలు నెక్లెస్ రోటరీ వైపు అనుమతించబడవు. వీవీ విగ్రహం వద్ద షాదన్ కళాశాల – రవీంద్ర భారతి వైపు మళ్లించబడతాయి.
- బుద్ద భవన్/నల్లగుట్ట జంక్షన్ నుండి నెక్లెస్ రోటరీ వైపు వెళ్లే వాహనదారులను నెక్లెస్ రోటరీ వైపు అనుమతించరు. నల్లగుట్ట జంక్షన్ వద్ద రాణిగంజ్/ట్యాంక్బండ్ వైపు మళ్లిస్తారు.
- రసూల్పురా/మినిస్టర్ రోడ్ నుండి నల్లగుట్ట మీదుగా నెక్లెస్ రోటరీ వైపు వెళ్లే వాహనాలను నెక్లెస్ రోటరీ వైపు అనుమతించరు మరియు నల్లగుట్ట జంక్షన్ వద్ద రాణిగంజ్ వైపు మళ్లిస్తారు.
- ఇక్బాల్ మినార్ జంక్షన్ నుండి తెలుగు తల్లి జంక్షన్ మరియు ట్యాంక్ బండ్ వైపు వెళ్లాలనుకునే వారు తెలుగు తల్లి వైపు అనుమతించబడరు. వారు కట్ట మైసమ్మ దేవాలయం/లోయర్ ట్యాంక్ బండ్ వైపు తెలుగు తల్లి ఫ్లైఓవర్ వైపు వెళ్ళాల్సి ఉంటుంది.
- ఇక్బాల్ మినార్ జంక్షన్ నుండి మింట్ కాంపౌండ్ లేన్ వైపు వచ్చే ట్రాఫిక్ ఇక్బాల్ మినార్ జంక్షన్ వద్ద రవీంద్ర భారతి జంక్షన్ వైపు మళ్లించబడుతుంది.
- ట్యాంక్ బండ్/తెలుగు తల్లి నుండి నెక్లెస్ రోటరీ వైపు వచ్చే వాహనాలు తెలుగు తల్లి జంక్షన్ వద్ద ఇక్బాల్ మినార్/రవీంద్ర భారతి జంక్షన్ వైపు మళ్లించబడవు. బీఆర్కేఆర్ భవన్ నుండి నెక్లెస్ రోటరీ వైపు వచ్చే ట్రాఫిక్ తెలుగుతల్లి జంక్షన్ వద్ద ఇక్బాల్ మినార్/రవీంద్ర భారతి జంక్షన్ వైపు మళ్లించబడుతుంది.
- ఖైరతాబాద్ బడా గణేష్ లేన్ నుండి ప్రింటింగ్ ప్రెస్ జంక్షన్ లేదా నెక్లెస్ రోటరీ వైపు వెళ్లే వాహనదారులు బడా గణేష్ వద్ద రాజ్దూత్ లేన్ వైపు మళ్లిస్తారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE