సికింద్రాబాద్లో బుధవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సికింద్రాబాద్ పరిధిలోని బోయగూడలో ఉన్న ఒక స్క్రాప్ గోడౌన్లో తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. స్క్రాప్ గోడౌన్, టింబర్ డిపోగా ఉపయోగిస్తున్న భవనంలో ఒక్కసారిగా భారీ మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో 11 మంది సజీవ దహనం అయ్యారు. అయితే, ఈ ప్రమాదం జరిగిన సమయంలో టింబర్ గోడౌన్లో మొత్తం 15 మందికి పైగా కార్మికులున్నట్లు తెలుస్తోంది. తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు, దట్టమైన పొగ భారీగా ఎగసిపడ్డాయి. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే ఫైర్ డిపార్ట్మెంట్ కి సమాచారం ఇచ్చారు. ఇక సమాచారం అందగానే అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తేవడానికి ప్రయత్నించారు. మృతులలో కొంతమంది సజీవదహనం కాగా మిగిలిన వారు పెద్ద ఎత్తున వ్యాపించిన దట్టమైన పొగతో ఊపిరాడక మృతి చెందినట్లు తెలుస్తోంది.
అందరూ నిద్రిస్తున్న సమయంలో ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. స్క్రాప్ ఎక్కువగా నిలువచేసి ఉండటం వల్ల మంటలు వెంటనే భవనం మొత్తం వ్యాపించినట్లు చెప్తున్నారు. కాగా మృతి చెందిన వారందరినీ బిహార్కు చెందిన వలస కార్మికులని, చనిపోయినవారిని సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించామని పోలీసులు పేర్కొన్నారు. అయితే మృతదేహాలు పూర్తిగా కాలిపోయి గుర్తించలేని స్థితిలో ఉన్నాయని వారు తెలిపారు. విషయం తెలిసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదంపై ఆరా తీశారు. అలాగే అగ్ని ప్రమాదంపై విచారణకు ఆదేశించారు. అక్కడున్న బాధిత కుటుంబాలను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. కాగా ఈ గోడౌన్కు ఎలాంటి అనుమతులు లేవని, సరైన నిబంధనలు కూడా పాటించటంలేదని అధికారులు తెలిపారు. ఈ ప్రమాద ఘటనపై వీలైంత త్వరగా విచారణ చేసి పూర్తి వివరాలు అందిస్తామని తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ