తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ , రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ జిల్లాలలో కోవిడ్ మేనేజ్ మెంట్ పై జిల్లా కలెక్టర్లు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, జిల్లా ఆస్పత్రుల సూపరింటెండెంట్ లతో గురువారం నాడు బి.ఆర్.కె.ఆర్. భవన్ నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ, స్థానిక జిల్లా మంత్రుల సలహాలు, సూచనలతో జిల్లాలో కరోనా వైరస్ నివారణ చర్యలను చేపట్టాలని కలెక్టర్లను కోరారు. హోమ్ ఐసోలేషన్ లో ఉన్న పేషెంట్ల ఆరోగ్య పరిస్థితిని రెగ్యులర్ గా మానిటర్ చేయాలని, డాక్టర్లతో తగిన కౌన్సిలింగ్ ను అందించాలని కలెక్టర్లను ఆదేశించారు. పేషెంట్లందరికి అవసరమైన చికిత్స అందించి వారిలో భరోసా కల్పించాలని చెప్పారు.
సీఎస్ సోమేష్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలలో టెస్టింగ్ కోసం వచ్చిన ప్రతి ఒక్కరికి టెస్టింగ్ చేయడంతో పాటు ఆప్ లో తప్పని సరిగా వివరాలు నమోదు చేయాలన్నారు. పాజిటివ్ పేషెంట్లకు కౌన్సిలింగ్ తో పాటు మెడికల్ కిట్ ను అందజేయాలన్నారు. కొత్త టెస్టింగ్ సెంటర్ల ఏర్పాటు కోసం తగు వివరాలతో ప్రతి పాదనలు సమర్పించాలన్నారు. కోవిడ్ చికిత్సకు అవసరమైన వైద్యులు, మెడికల్ సిబ్బందికి తాత్కాలిక పద్దతిలో నియమించడానికి అవసరమైన ప్రతిపాదనలు ఇస్తే అందుకు అనుగుణంగా అనుమతులు ఇస్తామన్నారు.
కోవిడ్ చికిత్సకు దరఖాస్తులు చేసిన ప్రైవేట్ ఆస్పత్రుల అనుమతి ప్రతిపాదనలను కూడా సమర్పించాలని సీఎస్ చెప్పారు. జిల్లా ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రులు, ప్రభుత్వ మెడికల్ కాలేజీల అనుబంద ఆస్పత్రులలో ఉన్న అన్ని బెడ్లకు ఆక్సిజన్ సదుపాయం కల్పించడానికి ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించారు. కోవిడ్ చికిత్సకు సంబంధింత పెండింగ్ బిల్లులు తగు ప్రొఫార్మలో సమర్పించాలన్నారు. ఐసోలేషన్ కిట్లు, అందజేసే మందుల వివరాలకు సంబంధించి సర్కూలర్ ను రూపొందించాలని కోవిడ్ కు సంబంధించిన ట్రీట్ మెంట్ ప్రోటో కాల్ పై నిబంధనలు రూపొందించాలని సీఎస్ సోమేష్ కుమార్ వైద్య శాఖ అధికారులను ఆదేశించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu